మోదీ దర్శనానికి బయలుదేరుతున్న జగన్

ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఏ పనైనా డబ్బుతో కూడుకున్నాదే. అందులోనూ ప్రభుత్వాలు నడపాలంటే రోజువారీ డబ్బులు విపరీతంగా కావాలి. పైగా జగన్ లాంటి అనాలోచిత ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రులు పాలన నడపేందుకు భారీ స్థాయిలో నిధుల కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే ఇప్పుడు జగన్ మళ్లీ కేంద్రం వైపు చూస్తున్నారు మోదీకి వంగి వంగి దణ్ణాలు పెట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.

ఈ నెల 27వ తేదీన జరగనున్న నీతి అయోగ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తమానం అందింది. ఏపీ సీఎం జగన్ సైతం హాజరుకానున్నారు. పాలనలో చివరి ఏడాది కావడంతో విభజన హామీలపై గట్టిగా మాట్లాడితే కొంతవరకూ వర్కవుట్ అయ్యే అవకాశం ఉందని వైసీపీ చెబుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే అసలు సంగతి వేరుగా ఉంది. జగనన్న అప్పుల స్కీమ్ ఖాతాలోకి మరికొంత నగదు వేయించుకునేందుకే ఆయన వెళ్తున్నారని తెలుస్తోంది. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు జగన్ పడని పాట్లు లేవని కూడా అంటున్నారు. ఎందుకంటే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం వేళ్లాలన్న ప్రత్యేకమైన రూలు కూడా ఏమీ లేదు. ఐనా జగన్ వెళ్తున్నారు..

అప్పులు తీసుకురావడంలో జగన్ సిద్ధహస్తుడని చెబుతుంటారు. తాజాగా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు అప్పు వచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ లో అప్పు తీసుకొచ్చిన రాష్ట్రం తన రుణాల పరంపరను కొనసాగించింది. ఈ క్రమంలో 47 రోజుల్లో రూ.11,500 కోట్ల రుణం పొందినట్లయ్యింది. అంటే ఎఫ్ఆర్బీఎం పరిమితి కూడా వేగంగా పూర్తవుతోందని అర్థం చేసుకోవాలి. నిజానికి 2023-24లో ఎఫ్ఆర్బీఎం కింద ఏపీకి కేంద్రం రూ.30,500 కోట్ల రుణపరిమితి కల్పించింది. ఇదే వేగంతో అప్పులు చేస్తే డిసెంబరులోపే ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి పోతుంది.

జగన్ భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఆయన అడిగినంత అప్పు కేంద్రం ఇస్తూనే ఉంటుంది. ఎఫ్ఆర్బీఎం పరిమితితో సంబంధం లేకుండా కూడా అప్పులిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ రెడీగా ఉంటుంది. కాకపోతే మోదీకి కోపం రాకుండా చూసుకోవాలంతే. జగన్ ఇప్పుడు ఆ పనిమీదే ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోదీ కనిపించినప్పుడల్లా దణ్ణాలు పెడుతూ మెలికలు తిరిగిపోతున్నారు. అలా అనే కంటే మోదీని కలిసేందుకు ఆయన అవకాశాలు వెదుక్కుంటున్నారు. రాష్ట్రం ఎటు పోతే ఆయనకు ఎందుకు చెప్పండి…