లైగర్ గొడవ.. వరంగల్ శీను వెర్షన్ ఇదీ

Warangal Sreenu
Warangal Sreenu

‘లైగర్’ సినిమా రిలీజై తొమ్మిది నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా తాలూకు నష్టాల గొడవ మాత్రం ఇంకా తేలలేదు. ఈ సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లు పరిహారం కోరుతూ కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నిరాహార దీక్షలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా మీద భారీ పెట్టుబడి పెట్టి కోలుకోలేని దెబ్బ తిన్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను.. దాదాపుగా డిస్ట్రిబ్యూషన్ ఆపేసి సైలెంట్ అయిపోయాడు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న నిరాహార దీక్షల్లో వరంగల్ శీను కనిపించడం లేదు.

ఈ దీక్షలతో ఆయనకు దీంతో సంబంధమే లేదని ఒక వెర్షన్ వినిపిస్తుంటే.. అందరినీ ఉసిగొల్పి తెర వెనుక కథ నడిపిస్తున్నాడంటూ ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మొత్తం గొడవ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు వరంగల్ శీను.

పూరి జగన్నాథ్‌కు తాను ఒక అడ్మైరర్ అని.. సినిమాల పరంగానే కాక, వ్యక్తిగతంగానూ ఆయనంటే తనకెంతో ఇష్టమని వరంగల్ శ్రీను ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మంచి రేటు ఇచ్చి తీసుకోవడమే కాక..పూరికి ఎవ్వరూ ఇవ్వలేని ఓవర్ ఫ్లోస్ ఇచ్చినట్లు శ్రీను గుర్తు చేసుకున్నాడు.

ఐతే ‘ఇస్మార్ట్ శంకర్’ ద్వారా వచ్చిందాని మీద చాలా పెద్ద మొత్తంలో ‘లైగర్’ వల్ల నష్టపోయినట్లు శ్రీను తెలిపాడు. ‘లైగర్’ సినిమా క్లైమాక్స్ 15 నిమిషాలు మినహాయిస్తే సినిమాకు తనకు నచ్చినట్లు చెప్పిన శ్రీను.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాక పూరి కానీ, ఛార్మీ కాని తనతో అస్సలు మాట్లాడలేదని స్పష్టం చేశాడు. డబ్బుల సంగతి పక్కన పెడితే అసలేం జరుగుతోందనే విషయంలో ఒకసారి మాట్లాడదామని పూరి, ఛార్మిలకు ఫోన్లు చేస్తుంటే.. ఎవ్వరూ ఇంత వరకు తన కాల్స్ లిఫ్ట్ చేయలేదని శ్రీను తెలిపాడు.

తనకు వ్యతిరేకంగా ధర్నా చేయాలనుకున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు వార్నింగ్ ఇస్తూ ఎవ్వరైనా బతికేది పరువు కోసమే అని పూరి వ్యాఖ్యానించాడని.. మరి తనకు మాత్రం పరువు ఉండదా అని శ్రీను ప్రశ్నించాడు. ఆ టైంలో పూరికి వ్యతిరేకంగా ధర్నా చేయాలంటూ వాట్సాపుల్లో తిరిగిన మెసేజ్ విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని.. నిజానికి పూరి మోసం చేసే వ్యక్తి కాదని, ఆయన్ని కలిసి మాట్లాడదాం అనే తాను అందరికీ చెప్పానని.. కానీ ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో తిరగడంతో దాని వెనుక ఉన్నది తనే అని పూరి సహా అందరూ అపార్థం చేసుకున్నారని.. తన మీద కక్షగట్టి కొందరు ఈ డ్రామాను నడిపించారని భావిస్తున్నట్లు శ్రీను చెప్పాడు. తాను భారీగా నష్టపోవడం గురించి తెలిసి, తనకు న్యాయం జరగాల్సిందే అంటూ మొదట్లో మాట్లాడారని.. కానీ నెమ్మదిగా ఆయన తన వైపు మాట్లాడ్డమే మానేశారని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడీ ఇంటర్వ్యూలో.