BRS మేనిఫెస్టో లీకులు.. టెస్టింగా? డైవర్షనా?

తెలంగాణలో ఎలాగైనా మూడోసారి గెలిచి అధికారం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఆ క్రమంలోనే ప్రజల, ప్రతిపక్షాల నాడి, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అంశాలు కూడా ఆ పార్టీ వ్యూహాలలో భాగమేనని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులే టార్గెట్‌గా పలు పథకాలను అమలు చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకూ మార్పులు చేర్పులు చేస్తారని చెప్తున్నారు. ఎక్కువగా దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలో కూడా అమలు చేసేలా కేసీఆర్ స్కెచ్ గీస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటితో పాటు ట్రంప్ కార్డ్ లాంటి సూపర్ స్కీమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారని.. అది ఎన్నికలకు ముందు మిగతా పార్టీలకు టైం ఇవ్వకుండా దాన్ని బయటపెడతారని తెలుస్తోంది. ఆ ట్రంప్ కార్డ్ లాంటి స్కీమ్ ఏంటనేది ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుుతన్నారు.

తాజా లీకుల ప్రకారం.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులకు మంథ్లీ ఫించన్, రైతుబంధు, ఫ్రీ కరెంటు వంటివి ప్రచారమవుతున్నాయి. రైతులకు రూ.2,016 నెలవారీ పింఛన్ ఇస్తారని, రైతుబంధు పథకానికి సీలింగ్ 12 ఎకరాలుగా నిర్ణయిస్తారని.. ఆసరా పింఛను మొత్తం రూ. వెయ్యి పెంచుతారని, 200 యూనిట్ల వరకు ఫ్రీకరెంట్, మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివన్నీ ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇందులో ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రస్తుతం దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్నవే. వీటితో పాటు భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులో మహిళలకు 1% రాయితీ ఇస్తారనీ అంటున్నారు.

ఇవన్నీ బీఆర్ఎస్ నుంచి వస్తున్న లీకులుగానే ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈ లీకులపై ప్రజల స్పందన ఎలా ఉందో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తెలుసుకుంటున్నారని.. దాన్ని బట్టి ముందుకెళ్లాలో వద్దో నిర్ణయించుకుంటారని అంటున్నారు. ప్రజల నుంచి స్పందన బాగుంటే ఎన్నికలకు ముందే రైతులకు పింఛన్ పథకం అమలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులందరికీ ప్రతి నెలా రూ.2,016 పింఛను ఇచ్చే స్కీమ్‌పై ఇప్పటికే పార్టీ పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.

రైతుల ఆదాయం, వారికున్న సాగుభూములే ప్రామాణికంగా ఉండాలా? ప్రభుత్వ ఖజానాపై పడే భారమెంత?.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందే రైతులెంత మంది ఉంటారు? దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోడానికి ఉన్న మార్గాలేంటి? రైతుబంధు స్కీమ్‌ను 10-12 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తే సేవ్ అయ్యేదెంత? వంటి అంశాలపై అటు ఇంటెలిజెన్స్ సిబ్బంది, ఇటు ఆర్థిక శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతుబంధు కోసం సగటున రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. సుమారు 65 లక్షల మంది రైతులు దీని ద్వారా సాయం అందుకుంటున్నారు.

ఇందులో లక్షల మంది మాత్రమే పది ఎకరాలకంటే ఎక్కువ సాగుభూములు ఉన్నారనేది ప్రభుత్వ అంచనా. రైతుబంధు సాయంలో వీరికి కోత పెట్టడం ద్వారా పేద రైతులు సంతృప్త చెందుతారన్నది సర్కారు అభిప్రాయం. అయితే.. ఈ లీకులతో ప్రజాస్పందన తెలుసుకోవడం ఒక ఎత్తయితే.. ఈ స్కీముల చుట్టూ ప్రతిపక్షాలు తిరుగుతూ వీటికి పోటీ స్కీములు రూపొందించే పనిలో పడితే.. తాము పూర్తిగా భిన్నమైన పథకాలు, మరింత మెరుగైన పథకాలను ఎన్నికల నాటికి ప్రకటించి విపక్షాలను దెబ్బతీయొచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. విపక్షాల ఫోకస్ డైవర్ట్ చేయడానికి ఈ లీకులు ఇస్తున్నట్లుగానూ చెప్తున్నారు.