కరోనా కోసం చేరితే.. అగ్నికి ఆహుతయ్యారు

దురదృష్టం అంటే ఇదే. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలై.. దాన్నుంచి కోలుకునేందుకు ఆసుపత్రిలో చేరితే అక్కడ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం. అహ్మదాబాద్‌లోని కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న శ్రేయ ఆసుపత్రి ఐసీయూ వార్డులో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ‌ ఆసుపత్రిలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి.

అవి ఐసీయూ వార్డుకు పాకడం.. అక్కడున్న రోగులు నిస్సహాయ స్థితిలో మంటల్లో చిక్కుకోవడం నిమిషాల్లోనే ఎనిమిది మంది అగ్నికి ఆహుతి కావడం జరిగిపోయాయి. కొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసే లోపే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

మంటలు చెలరేగగానే బయటకు పరుగులు తీయడంతో సిబ్బంది, రోగులు చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 40 మంది రోగులను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం విజయ్ ‌రూపాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పీఎం సహాయనిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆసుపత్రి ముందు మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. కోవిడ్‌కు చికిత్స కోసం వస్తే ఇలా ప్రాణాలు కోల్పోవడమేంటని వాళ్లు గుండెలవిసేలా రోదించారు.