టీడీపీలోకి మేక‌పాటి.. మారుతున్న నెల్లూరు రాజ‌కీయం!

నెల్లూరు రాజ‌కీయాల్లో కీల‌క‌మైన కుటుంబం మేక‌పాటి ఫ్యామిలీ. ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న సోద‌రుడు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు.. త‌ర్వాత వైసీపీకి చేరువ‌య్యారు. అయితే.. వైసీపీలో ఇటీవ‌ల నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేశార‌ని భావించిన వైసీపీ.. చంద్ర‌శేఖ‌రరెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ప్ర‌స్తుతం ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. దీంతో తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు.

ఇదిలావుంటే.. తాజాగా ఆయ‌న టీడీపీలో చేరే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మేకపాటి‌ టీడీపీలోకి వెళ్లేందుకు‌ లైన్ క్లియర్ చేసుకుంటున్నారని అంటున్నారు. నిజానికి రాజ‌కీయ శ‌తృవులుగా ఉన్న బొల్లినేని, మేకపాటి తాజాగా ఒకే వేదిక‌పై క‌లుసుకోవ‌డం.. ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నా.. మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా నేత‌లు కూడా మారుతున్నార‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

కొద్ది రోజుల క్రితం కూడా దుత్తలూరులో చిరకాల రాజకీయ శత్రువు అయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగించారు. మేకపాటి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే చర్చలు అప్పట్లోనూ సాగాయి. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని మేకపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.

ఇప్పుడు మ‌రోసారి బొల్లినేని రామారావుతో మేక‌పాటి భేటీ కావ‌డం ఆయ‌న త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు అనే సూత్రం ఎలానూ ఉంది. పైగా వైసీపీ కూడా స‌స్పెండ్ చేసిన ద‌రిమిలా.. మేక‌పాటి టీడీపీలోకి వ‌చ్చినా.. రావొచ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.