గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో మార్పులు జరిగాయి. తాజాగా జనసేన నుంచి వచ్చినటువంటి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి పార్టీలో చేరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో సత్తెనపల్లిలో వైసిపి మరింత పుంజుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని మంత్రి రాంబాబు సైతం చెప్పుకొచ్చారు. సత్తెనపల్లిలో వైసిపి పుంజుకుంటుందని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసిపి గెలుస్తుందని తెలిపారు.
అయితే మరోవైపు వైసీపీలోనే సత్తెనపల్లిలో ఉన్నటువంటి లోకల్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు.. కుమ్ములాటలు తరచుగా తరమీదకు వస్తున్నాయి. అంబటి రాంబాబు తమను పట్టించుకోవడంలేదని కనీసం తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇటీవలే కొందరు నాయకులు ఇంటి ముందు ధర్నా చేశారు అయితే దీనిపై ఆయన సమాధానం కూడా చెప్పకుండా ఎదురు దాడికి దిగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా అందిస్తున్నామని పైకి చెబుతున్నప్పటికీ వైసీపీలో తనకు అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులను దూరం పెడుతున్నారనేది ఇక్కడ నాయకుల మాట.
అంతే కాదు సత్తెనపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని కేవలం తనను పొగుడుతున్న వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని తనకు బ్రహ్మరథం పట్టిన వారికి తనకు పూలు పరిచి నడిపించిన వారికి మాత్రమే పార్టీలో పదవులు కల్పిస్తున్నారని సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు సొంత పార్టీ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎర్రం వెంకటేశ్వర రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే అసలు ఉన్నటువంటి అసంతృప్తులను తగ్గించేటటువంటి అంశం మీద అంబటి రాంబాబు దృష్టి పెట్టకపోవడం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి జోరు పెద్దగా కనిపించడం లేదు. కానీ ఎన్నికల సమయానికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సానుభూతి గనక పని చేసినట్లయితే సత్తెనపల్లిలో వైసీపీకి ఎదురుగాలులు వీయడం ఖాయమని అంటున్నారు. ఇక, ఎర్రం వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు.
తర్వాత 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఆయన కేవలం 9000 ఓట్ఉల మాత్రమే తెచ్చుకోగలిగారు. ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇక్కడ పెద్దగా ఇమేజ్ లేదు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ జెండాపై ఆయన గెలిచారు తర్వాత జనసైని తరఫున పోటీ చేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన దూకుడు ప్రదర్శించలేకపోయారు. దీంతో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీలోకి వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై అంబటి రాంబాబు దృష్టిపెట్టి వాటిని పరిష్కరించగలిగినప్పుడే వైసిపి ఇక్కడ పుంజుకోవడం అనేది కనిపిస్తుందని లేకపోతే ఈ సీటు ను వదులుకోక తప్పదని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates