జ‌గ‌న్‌కు భారీ షాక్.. జీవో 1ని కొట్టేసిన హైకోర్టు

Y S Jagan

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సీఎం జ‌గ‌న్ ఈ ఏడాది ప్రారంభంలో జ‌న‌వ‌రి 2వ తారీకు తీసుకువ‌చ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేలా ఈ జీవో ను జారీ చేశారు. దీనిపై ప‌ద్ద ఎత్తున తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీడీపీ, జ‌న‌సేనల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ యుద్ధం కూడా ఎదురైంది. అయినా.. స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు.

దీంతో ఈ జీవోను సవాల్‌ చేస్తూ టీడీపీ, వామ‌ప‌క్షాలు స‌హా ప్ర‌జాసంఘాల నాయ‌కులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం తాజాగా శుక్ర‌వారం తీర్పు వెల్లడించింది. విచారణ సందర్భంగా.. “రోడ్‌ షోలను కట్టడి చేసేలా జీవో ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారు. పోలీస్‌ యాక్ట్‌ 30కు భిన్నంగా జీవో జారీ చేశారు” అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

జీవో మంట‌లు..

రహదారులపై బహిరంగ సమావేశాలు, ముఖ్యంగా రోడ్ షోలు.. నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం ప్రభుత్వం జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ నేత గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.

పోలీసు చట్టం సెక్షన్‌ 30 ప్రకారం ‘కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి, ప్రత్యేక పరిస్థితులుంటే నిరాకరించండి’ అని ఈ సెక్ష‌న్‌ చెబుతోందన్నారు. జీవో 1 దీనికి భిన్నంగా ‘అనుమతి నిరాకరించండి, ప్రత్యేక పరిస్థితులుంటేనే అనుమతించండి’ అని చెబుతోందన్నారు. ప్రతిపక్షాలు రహదారులపై నిర్వహించే కార్యక్రమాలను జీవో 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. ఆ వ్యాజ్యాలపై 2023 జనవరి 24న లోతైన విచారణ జరిపి తీర్పును నేటికి రిజర్వు చేసి.. జీవో నెంబర్1ను కొట్టివేసింది.

అయితే.. దీనిపై విచార‌ణ ఎప్పుడో పూర్త‌యినా.. తీర్పు ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ..కొల్లు ర‌వీంద్ర ఇటీవ‌ల సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు విష‌యాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో మే 30లోగా తీర్పు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టును ఆదేశించింది. ఈ క్ర‌మంలో తాజాగా కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఇదిలావుంటే.. హైకోర్టు తీర్పుపై ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. 1835 నాటి బ్రిటీష్ చ‌ట్టాల‌ను అనుస‌రించి జ‌గ‌న్ స‌ర్కారు ఈ జీవోను తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.