ప్ర‌భుత్వం స‌రిగా ఉంటే.. నేను రంగంలోకి దిగేవాడిని కాదు: ప‌వ‌న్‌

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం పట్టించునే పరిస్థితి రాలేదని అన్నారు. జనసేన పార్టీ పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే పొలాల వద్ద ఉన్న ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు.

ప్ర‌భుత్వం స‌రిగా ప‌నిచేస్తే తాను రంగంలోకి దిగేవాడిని కాద‌ని చెప్పారు. ఈ విష‌యం గతంలో కూడా చెప్పాన‌న్నారు. ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే రైతుల‌ను అణిచేయాల‌ని చూస్తోంద‌న్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయని తెలిపారు. ధాన్యం కొన్నవారి ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడం లేదన్నారు.

క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్‌ పరిశీలించలేదని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్లినా కారణం లేకుండానే రైతులను అరెస్టు చేస్తున్నారని.. అందుకే తాను క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌ల‌కు రావాల్సి వ‌చ్చింద‌న్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. “మాకు సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే రైతులపై కేసులు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయి.” అని పవన్ కల్యాణ్ హెచ్చ‌రించారు.