క‌ర్ణాటక ఏమైపోతోంది?: ప్ర‌కాష్‌రాజ్‌

ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల‌కే ఖ‌చ్చితంగా ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో సెలబ్రిటీలు, కేంద్రమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎటు చూసినా... పోలీసులు.. కేంద్ర బ‌ల‌గాలు క‌నిపిస్తున్నాయి. దీనిఅర్ధం ఏంటి? భ‌య‌పెట్టి ఓటు వేయించాల‌ని అనుకుంటున్నారా? అస‌లు ఇలా ఉంటే.. ఓట‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తారా?అని నిల‌దీశారు.

అదేవిధంగా ‘‘మనం మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి… కర్ణాటక ఉజ్వలంగా ఉండాలి’’ అని నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత నిర్మలా సీతారామన్ తాను ఓటు వేసినట్లు వీడియోను ట్వీట్ చేశారు. కన్నడ సినీనటి అమూల్య తన భర్తతో కలిసి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు జరుగుతుంది. 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది అర్హులైన ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులే (2,67,28,053) అధికం. మహిళా ఓటర్ల సంఖ్య 2,64,00,074 కాగా.. ఇతరులు 4,927 మంది.

రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 4 లక్షల మంది సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 75,603 బ్యాలెట్‌ యూనిట్లు, 70,300 కంట్రోల్‌ యూనిట్లు , 76,202 వీవీప్యాట్లు వినియోగించనున్నారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1.56 లక్షల మంది పోలీసులను బందోబస్తులో పాల్గొంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమందిని ఎన్నికల భద్రతకు కేటాయించడం ఇదే తొలిసారి. దీంతో ఎటు చూసినా.. పోలీసులు.. వారి వాహ‌నాలే క‌నిపిస్తుండ‌డంతో సామాన్యులు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌నే టాక్ మీడియాలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.