పది అమెరికా బడ్జెట్లు కావాలి…

వైఎస్ హయాం నుంచి ఓ మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. మాట తప్పం.. మడమ తిప్పం..అనేది ఆయన డైలీ రొటీన్ డైలాగ్. ఇప్పటికీ చాలా మంది నేతలు అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడుతుంటారు. కాపీ కొట్టకూడదని పదాలు మార్చుతారంతే..

అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓటర్లను హామీల జడివానలో ముందేచేసేందుకు నేతలు తెగ ఆరాటపడిపోతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ ను చదివి వినిపించారు. అందులో ఐదు భారీ హామీలున్నాయి. ప్రైవేటు రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కూడా ఉంది..

ఐదేళ్లు అవకాశమివ్వండి..

ప్రియాంక తన స్పీచ్ లో యూత్ డిక్లరేషన్ మొత్తాన్ని మళ్లీ హిందీలో చదివి వినిపించారు. ప్రజల కోసం పనిచేస్తున్నామని ఒక అవకాశం ఇస్తే అన్ని హామీలు అమలు చేస్తామని ఆమె చెప్పుకున్నారు. లేనిపక్షంలో ఐదేళ్ల తర్వాత తమను ఇంటికి పంపించొచ్చని ఆమె అనడం ఒక ఆసక్తికర పరిణామమే అవుతుంది.

నారా లోకేష్ హామీ వర్షం

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది. నడుస్తూనే ఆయన ఒకటి రెండు చోట్ల ఆగి ముప్పావు గంట సేపు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ రెండు నుంచి ఐదు నిమిషాలు ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. వీధి కుళాయి వేసే హామీ కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనం మీదకు వదలాల్సి వస్తోంది. విశ్వసనీయత కోసం పడుతున్న పాట్లా ఇవీ..

గుడివాడ కథలు

ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. పెట్టుబడుల సదస్సులో పైగా రాబట్టలేకపోయినా.. పాపం ఆయనకు గడప గడపకు కార్యక్రమం తప్పడం లేదు. కాలువలు లేవు, రోడ్లు లేవు అని అనకాపల్లి జనం చెబుతుంటే అన్ని పనులు దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. తాను చెప్పిన పనులు చేయకపోతే ఓట్లు అడిగేందుకు రానని అమర్ నాథ్ అంటున్నారు. అబ్బా వినడానికి ఎంత బావుందో..

పది అమెరికా బడ్జెట్లు కావాలి…

నాయకులు ఇస్తున్న హామీలు వింటున్న సందర్భంలోనే ఒక జోక్ ప్రచారంలోకి వచ్చింది. ప్రియాంక అయినా లోకేష్ అయినా ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. వారు చెప్పినవన్నీ చేయాలంటే ఏపీ, తెలంగాణకు ప్రతీ ఏటా పది అమెరికా బడ్జెట్లు కావాలట. అది కూడా చాలకపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదట.

ఇక పోటీ చేయరా…

హామీలు నెరవేర్చకపోతే ఇక పోటీ చేయరా.. అంటే అబ్బే లేదండీ.. ఓటర్లను వలలో వేసుకునేందుకు అలా చెబుతుంటామంతే…అని ఏ నేత అయినా ప్రైవేటుగా అనేస్తారు. పైగా జగనన్న ఎగ్గొట్టిన కొండవీటి చాంతాడంత హామీలు చూస్తే నేతలు ఎలా ప్రవర్తిస్తారో అర్థమవుతుంది. సామాజిక పెన్షన్లు రూ. 3 వేల ఇస్తానని చెప్పి, ఏడాదికి రూ.250 మాత్రమే పెంచిన ఘనుడు ఆయన. ప్రియాంక , లోకేష్, గుడివాడ ఎవరైనా జనాన్ని ఆకట్టుకునేందుకు ఏవేవో చెబుతుంటారు. వాటిని నమ్మి ఓట్లేయ్యాలా, నిజంగా పనిచేసే వాళ్లకి ఓట్లెయ్యాలా జనమే నిర్ణయించుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం. ఎవరోకరికి ఓటెయ్యక తప్పదు..