భాగ్యనగరంలో ఉగ్రవాదుల కలకలం

హైదరాబాద్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. వాళ్లు భారీ దాడికి ప్లాన్ చేసే లోపే భద్రతా దళాలు అలెర్ట్ కావడంతో సామూహిక జనహననాన్ని నివారించగలిగారు.

తెలంగాణ రాజధానిలో మారణహోమం సృష్టించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారు. ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా ఆ సంగతి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

ఉమ్మడి దాడుల్లో మొత్తం 16 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అందులో 11 మంది మధ్యప్రదేశ్ వారు. హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది..

భద్రతా దళాల అదుపులో ఉన్న ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సాహిత్యం కూడా స్వాధీనమైందని చెబుతున్నారు. అసలు వారి ప్రధాన లక్ష్యం ఎవరు, వారి ప్లాన్ ఏమిటి తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని భద్రతా దళాలు అంటున్నాయి.

ఉగ్రవాదులందరినీ అరెస్టు చేశామని చెప్పలేని పరిస్థితుల్లో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. రోడ్లపైన అనుమానిత వస్తువులు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు..