రాష్ట్రపతి పాల్గొన్న ప్రోగ్రాంలో 9 నిమిషాలు కరెంటు లేకపోవటమా?

దేశ మొదటి పౌరుడిగా వ్యవహరించే రాష్ట్రపతి పాల్గొనే ప్రోగ్రాం అంటే అందుకు తీసుకునే చర్యలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. రాష్ట్రపతి పాల్గొన్న సమావేశంలో కరెంటు పోవటమే ఒక సంచలనం అయితే.. కరెంటుపోయిన తర్వాత తిరిగి వచ్చేందుకు ఏకంగా 9 నిమిషాల పాటు కరెంటు లేక చీకట్లలో ఉండిపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం తెలిస్తే.. నోట మాట రాదంతే.

దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండే రాష్ట్రపతి పాల్గొనే ప్రోగ్రాం అంటే ముందస్తు జాగ్రత్తలు ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటిది కరెంటు పోయి.. తొమ్మిది నిమిషాల పాటురాకపోవటం.. ఆమె పాల్గొన్న ఆవరణ మొత్తం చీకట్లు అలుముకోవటం.. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ఆపేయకుండా ఆమె కొనసాగించిన తీరు ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భానికి తగినట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని బరిపద లోని రామచంద్ర భంజదేవ్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న వేళ కరెంటు పోయింది. కరెంటు పోతే.. దాని స్థానంలో జనరేటర్ ఉంచినా.. ప్రయోజనం లేకుండాపోయింది. జనరేటర్ పని చేయకపోవటం.. కరెంటు లేకపోవటం కారణంగా ఆమె స్పీచ్ ఇస్తున్న ఆడిటోరియంలో చీకట్లు చిమ్ముకున్నాయి.

అయినప్పటికీ రాష్ట్రపతి తన స్పీచ్ ఆపలేదు. చీకటి వెలుగులను సమానంగా చూడాలన్న విషయాన్ని తాజా ఘటన నుంచి నేర్చుకోవాలంటూ ఓర్పుగా చెప్పిన ఆమె మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆ సమయంలోనూ ఎలాంటి చిరాకును ప్రదర్శించని ఆమె.. చిరునవ్వుతోనే తన ప్రసంగాన్నికంటిన్యూ చేశారు. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమంలో తొమ్మిది నిమిషాలు పాటు కరెంటు పోవటం.. ఆ సందర్భంలో అసహనానికి గురి కాకుండా వ్యవహరించటం.. కమ్ముకున్న చీకట్ల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని విద్యార్థులకు తన చేతల్లో చూపించిన రాష్ట్రపతి మాటలకు ఫిదా కావాల్సిందే. అదే సమయంలో.. బ్యాకప్ ప్లాన్ లేని అధికారులపై కఠిన చర్యలు తప్పనిసరి.