కరోనా బిల్లు చూసి.. ఆఫీసును ఆసుపత్రిగా మార్చేశాడు

Corona Hospital

విన్నంతనే నమ్మలేం. కానీ.. ఇది నిజంగా నిజం. కరోనా పాజిటివ్ కావటంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఒక వ్యాపారవేత్త.. ఎట్టకేలకు కోలుకోవటం బాగానే ఉన్నా.. అతగాడి చేతికి ఇచ్చిన బిల్లును చూసి గుండె ఆగినంత పనైందట. దాంతో ఆ వ్యాపారస్తుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఉదంతం గురించి చెబితే..

గుజరాత్ లోని సూరత్ పట్టణానికి చెందిన ఖాదర్ షేక్ అనే బడా వ్యాపారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలోచికిత్స పొందిన ఆయన.. చివరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. సదరుఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసి అవాక్కు అయ్యాడు.

తనలాంటి సంపన్నుడైతే వైద్యం చేసుకోవటం ఓకే. మరి..ఇదే జబ్బు పేదలకు వస్తే పరిస్థితి ఏమిటన్న ఆలోచన చేసిన తర్వాత ఆయన ఆస్సలు ఆగలేదు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆయన.. తన ఆఫీసు కార్యాలయాన్ని ఏకంగా కొవిడ్ ఆసుపత్రిగా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. వెంటనే.. పరిష్మన్ల కోసం ప్రయత్నించి.. తాను ఆసుపత్రి పెట్టాలనుకున్న కారణాన్ని చెప్పుకొచ్చారు.

దీంతో.. యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చేశారు. దీంతో.. అప్పటివరకూ తన ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని ఏకంగా ఆసుపత్రిగా మార్చేశాడు. మొత్తం 85 బెడ్లతో ఆసుపత్రిగా మార్చేశాడు. రోగులకు అవసరమై సకల సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చేశాడు. ఇతగాడి ప్రయత్నం చూసిన గుజరాత్ ప్రభుత్వం.. వైద్య సిబ్బంది.. యంత్రాలు.. మెడిసిన్లను పంపింది.

ఇక.. బెడ్లను.. కరెంటు బిల్లుల్ని తాను భరిస్తానని ఖాదర్ డిసైడ్ అయ్యాడు. మొత్తంగా ఆసుపత్రిని సిద్ధం చేశారు. తన ఆసుపత్రిలో కులం.. మతంతో సంబంధం లేకుండా ఎవరినైనా చేర్చుకుంటామని సెలవిస్తున్నారు. ఇలాంటి మనసున్న మారాజులు.. వెంటనే స్పందించే ప్రభుత్వాలుఊరికొకటి ఉంటే.. కరోనా కారణంగా ఆగమాగం అయ్యే పరిస్థితి ఉండదేమో?