సమయం లేదు మిత్రమా కమలమా, కమ్యూనిజమా..

ఇద్దరు అగ్రనేతలు కలిశారంటే ఏదో జరుగుతుందని అర్థం. వ్యూహాత్మక ముందడుగు వేసేందుకే భేటీ అయ్యారని అర్థం. ఇరు పార్టీల ప్రయోజనానికి పనిచేసే కార్యాచరణ రూపొందించుకుంటున్నారని అర్థం, రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని లెక్కలు వేసుకున్నారని అర్థం. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక ఉన్నది కూడా అదే అర్థం.

ఐదారు అంశాలు

పవన్ కల్యాణ్ సడన్ గా చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ప్రకటన లేకుండానే భేటీ జరిగింది. భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు. పవన్ ఇంటికి వెళ్లిపోయారు. ఐనా ముప్పావుగంట చర్చల్లో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు బయటకు పొక్కింది.పవన్ కల్యాణ్ పర్యటనతో పాటు చంద్రబాబు టూర్లలో వచ్చిన స్పందన ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. విపక్షాలను అణిచివేసేందుకు సీఎం జగన్ అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు, వాటిని ఎదుర్కోవాల్సిన తీరును కూడా చర్చించారని చెబుతున్నారు.

కేడర్ సంయమనం పాటించాలి..

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కల్యాణ్ అంటారు. జగన్ ను ఓడించేందుకు అందరూ కలిసి రావాలని చంద్రబాబు చెబుతారు. వారి మైత్రిని ఎగతాళి చేసి విభేదాలు సృష్టించేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తుంది. ఆ సంగతిని ఇద్దరు నేతలు పసిగట్టి చాలా రోజులైంది. ఏదో విధంగా కేడర్ ను రెచ్చగొట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. దానితో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పితే ఎవరూ పొత్తుల గురించి మాట్లాడకుండా కట్టడి చేస్తే బావుంటుందన్న అభిప్రాయం వెల్లడైంది. అయితే దీని కోసం క్షేత్రస్థాయి వరకు సందేశం వెళ్లాలి. కింది స్థాయి నేతలు కూడా ఆ సందేశానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఇద్దరు నేతల ముందున్న సవాలు అదే ..

పొత్తు ఎవరితో…

టీడీపీ, జనసేన పొత్తుకు అవరోధాలు తొలగిపోయాయి. మరి మిగతా పార్టీల పరిస్థితేమిటి. ఇంకా ఎవరిని కలుపుకుపోవాలన్న దానిపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్నగానే కొనసాగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. దానితో పొత్తు దిశగా ఒక అడుగు పడినట్లేనని భావిస్తున్నారు. బీజేపీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక దశలో తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని, టీడీపీ సంగతి ఇంకా తేల్చుకోలేదని కమలనాథులు ప్రకటించారు. ఇప్పుడు వైఖరి మారుతున్నట్లు చెబుతున్నారు.

జనసేన అధ్యక్షుడు వాపమక్ష వాది. ఆయన వారితో కలిసిపోయేందుకు వెనుకాడరు. కాకపోతే ఇప్పుడాయన బీజేపీ శిబిరంలో ఉన్నారు. మరో పక్క టీడీపీతో వామపక్షాలు స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.పైగా అమరావతి ఉద్యమం సహా అన్నింటా వామపక్షాలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దానితో కామన్ ఎనిమీని ఓడించేందుకు టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఇదే అంశం చంద్రబాబు, పవన్ భేటీలో చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కమలమా, కమ్యూనిజమా త్వరలోనే నిర్ణయించుకోవాలి….