జగనన్నకు చెబితే ఏమవుతుంది ?

jagan

జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమం మేనెల 9వ తేదీ నుంచి మొదలవ్వబోతోంది. తమ సమస్యలను జనాలు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే చెప్పుకోవచ్చట. జనాలు చెప్పే సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ ప్రకారం అధికారయంత్రాంగం పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి కలెక్టర్ ఆధీనంలో ప్రభుత్వం రు. 3 కోట్లను కేటాయించింది. ఈ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం 1902 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటుచేసింది. ఇదే విషయమై జగన్ ఉన్నతాధికారులతో మాట్లాడుతు ఈ ప్రోగ్రామ్ కు తన పేరుపెట్టారు కాబట్టి అధికారయంత్రాంగం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమిటో గుర్తుంచుకోవాలన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రోగ్రాములకు, పథకాలకు జగన్ పేరుపెట్టుకోవటం గొప్పకాదు. కార్యాచరణ లేదా వాటి అమలు ఎంత పక్కాగా ఉందనేది చూడాలి. ఎవరెంత చెప్పినా సమస్యంతా నిధుల దగ్గరే వస్తోంది. డబ్బులు లేనిదే ఏ ప్రోగ్రామ్, పథకం అమలుకాదు. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా డబ్బులు లేని కారణంగానే నత్తనడక నడుస్తున్నాయి. చిన్న చిన్న రోడ్లు, మురికికాల్వలు, వీధిలైట్లు లాంటి జనాలు రెగ్యులర్ గా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం కావటంలేదంటే డబ్బు కొరతే ప్రధాన కారణం.

కార్యక్రమాలను ఆర్భాటంగా ప్రకటించటం కాదు ఆచరణలోకి వచ్చినపుడే జనాలకు మేలు జరుగుతుంది. తొందరలో ప్రారంభించబోతున్న జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ఇపుడు స్పందన పేరుతో జరుగుతోంది. ఇందులో జనాలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్లకే చెప్పుకోవచ్చు.

జిల్లాకు బాసులు కలెక్టర్లే. అలాంటి బాసులకు తమ సమస్యలు చెప్పుకుంటుంటే ఎన్ని పరిష్కారమవుతున్నాయి. జనాల ఫీడ్ బ్యాక్ ప్రకారం చాలా సమస్యలు పరిష్కారం కావటంలేదు. కారణం ఏమిటంటే మళ్ళీ నిధుల సమస్యే. పార్టీలోని నేతలు, కార్యకర్తలకే పనులు కావటంలేదనే అసంతృప్తి వినబడుతోంది. ఇక మామూలు జనాలను ఎవరు పట్టించుకుంటారు. ఎన్నికలకు ముందు మొదలుపెట్టబోతున్న కొత్త ప్రోగ్రామ్ అమలయ్యే విధానం బట్టి ప్రభుత్వ ఇమేజి ఆదారపడుంటుంది. ఇదివరకు లాగ కాకుండా కలెక్టర్ కు రు. 3 కోట్లు కేటాయించారు కాబట్టి కొంతలో కొంత నయమేమో చూడాలి.