జేడీఎస్ నుంచి ఫోన్‌.. నేడో రేపో.. రంగంలోకి కేసీఆర్‌!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డ ప్ర‌చారం చేసేందుకు.. ముందుకు వ‌స్తాన‌ని.. గ‌తంలోనే ప్ర‌క‌టించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప్ర‌చారం పీక్ స్టేజ్‌కు చేరుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా నే ఉన్నారు. పైగా ఆయ‌న దృష్టంగా మ‌హారాష్ట్ర‌పై ఉంది. ఇదే కొన్ని రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. క‌ర్ణాట‌క‌కు చెందిన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి.. కేసీఆర్ అనుంగు మిత్రుడుగా మారారు.

కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వ‌చ్చి.. బీఆర్ఎస్ రాజ‌కీయాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అలాంటి పార్టీకి ప్ర‌చారం చేస్తాన‌న్న కేసీఆర్‌.. ప్ర‌చారం ప్రారంభించి ప‌ది రోజులు అయినా.. ఉలుకు ప‌లుకు లేకుండా ఉన్నారు. అయితే.. దీనికి కార‌ణం.. జేడీఎస్ నుంచి మ‌రోసారి ఆహ్వానం అంద‌లేద‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పాయి. అయితే.. అనుకున్న‌ట్టుగానే కుమార‌స్వామి నుంచి తాజాగా కేసీఆర్‌కు ఫోన్ వ‌చ్చింది.

రండి స‌ర్‌.. మ‌మ్మ‌ల్ని గెలిపించండి! అని కుమార స్వామి ఫోన్ చేసి కేసీఆర్‌ను ఆహ్వానించార‌ని స‌మ‌చారం.ఈ విష‌యాన్ని కేసీఆర్‌.. పార్టీలో చ‌ర్చించారు. దీంతో గురు లేదా, శుక్ర‌వారాల్లో కేసీఆర్ త‌న బృందాన్ని పంపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వీరిలో స‌రిహ‌ద్దు జిల్లాల నాయ‌కులు.. ముఖ్యంగా చోటు క‌ల్పిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే.. తాను కూడా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా.. మే 5- 8 మ‌ధ్య రెండు రోజులు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మ‌చారం.

బీజేపీని, ప్ర‌ధాని మోడీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్ ఇవే విష‌యాల‌పై అక్క‌డ కూడా ప్ర‌చారం చేయాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ జేడీఎస్ క‌న్నా.. కేసీఆర్‌.. మోడీని మైన‌స్ చేసేందుకు.. ఆయ‌న వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. దీనిపై క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేస్తారని తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.