భార్య కోసం.. త‌ల్లినీ.. చెల్లినీ వ‌దిలేశాడు: వైఎస్ ఆత్మీయుడి విమ‌ర్శ‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌నుపోలీసులు అరెస్టు చేయ‌డం.. జైలుకు వెళ్లడం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా.. ఆమె అన్న‌గా సీఎం జ‌గ‌న్ స్పందించ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై తాజాగా మాట్లాడిన వైసీపీ ఒక‌ప్ప‌టి నేత, తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు.. వైఎస్‌కు ఆత్మీయుడు గోనె ప్ర‌కాశ‌రావు..తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

త‌న భార్య భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ దూరంగా పెట్టారని ప్ర‌కాశ‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమన్నారు. షర్మిల పోలీసులను కొట్టారని తానో వీడియోలో చూశానని.. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు. ‘షర్మిల నా కూతురు లెక్క.. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను’ అని తెలిపారు. షర్మిల రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా అని ప్రశ్నించారు.

షర్మిల పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని గోనె నిలదీశారు. జగన్ షర్మిలను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిలను కలిశారని.. ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జగన్.. సదరు ఎంపీకి ఫోన్ చేసి.. ఎందుకెళ్లావ్..? సాయం చేయాల్సిన అవసరమేం ఉందని బెదిరించారని అన్నారు.

ష‌ర్మిల వెంట ఏపీ ఇంటెలిజెన్స్‌

షర్మిల ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారని గోనె మ‌రింత సంచ‌ల‌న విష‌యం చెప్పారు. జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిల మీద ఎందుకంత కోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఏపీలో పార్టీ పెడితే ఏమవుతుంది జగన్ పరిస్థితి అని ప్రశ్నించారు. “షర్మిల నా కూతురు లెక్కే కానీ.. జగన్ కొడుకు లెక్క కాదు” అని అన్నారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.