అమరావతికి ‘సీమ’ మద్దతు.. విశాఖకు నో


ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటంపై అప్పట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు అంతగా ఇష్టపడని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జగన్ సర్కారు రాజధానిని విశాఖకు తరలించే ప్రక్రియ చేపట్టటం.. త్వరలోనే ఆ పని మొదలవుతుందన్ స్పష్టమైన సందేశాన్ని ఈ మధ్యనే వెల్లడించటం తెలిసిందే. అయితే.. విశాఖకు రాజధానిని తరలించటంపై సీమ వాసుల వాదన ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా దీనికి సంబంధించి కీలక ప్రకటన ఒకటి రాయలసీమ కర్తవ్య దీక్ష కార్యక్రమం స్పష్టం చేసింది.

ఈ సభకు రాయలసీమకు చెందిన పలువురు ముఖ్యనేతలు వచ్చారు. వారంతా రాయలసీమ వెనుకుబాటుతనాన్ని ప్రస్తావించటంతో పాటు.. సీమలోని నాలుగు జిల్లాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమను ఒకరాష్ట్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఈ వాదనకు సంపూర్ణ మద్దతు లభించలేదు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు.. అనంతపురం జిల్లాల్ని తెలంగాణలో కలిపేసి రాయల తెలంగాణగా మార్చాలని.. దీనిపై ఇప్పటికే కేసీఆర్ తో తాను మాట్లాడినట్లు చెప్పి సంచలనంగా మారారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచాలని.. విశాఖ వద్దన్న వాదన పెద్ద ఎత్తున వినిపించటం కీలకంగా మారింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి మారిస్తే దూరాభారం అవుతుందని.. దీని కారణంగా సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సీమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్న నేతలు.. రాజధానిగా అమరావతికే తమ ఓటు వేయటం గమనార్హం. ఇంతకాలం రాజధానిగా అమరావతా? విశాఖనా? అన్న విషయంపై సీమ నేతల అభిప్రాయం ఏమిటన్న దానిపై క్లారిటీ లేకపోగా.. తాజా సభ ఈ విషయంపై స్పష్టత ఇచ్చిందని చెప్పాలి. అమరావతిని రాజధానిగా ఉమ్మడి గుంటూరు.. క్రిష్ణా జిల్లాల వారు మాత్రమే మద్దతు ఇస్తారన్న ప్రచారం తప్పన్నది తేలింది. మరేం జరుగుతుందో చూడాలి.