అమిత్ షా మీటింగ్ పర్పస్ ఇదేనా ?

హఠాత్తుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణా బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. 15 నిముషాల పాటు ముఖ్యనేతలతో అమిత్ మీటింగ్ ఉంటుందని ముందుగానే షెడ్యూల్ నిర్ణయించారు. అయితే తర్వాత షెడ్యూల్ ను మర్చారు. బీజేపీ ముఖ్యనేతలతో మీటింగ్ రద్దయ్యిందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా చేవెళ్ళ బహిరంగసభకే వెళిపోతారని చెప్పారు. టైం లేదుకాబట్టి ముఖ్యులతో మీటింగ్ ఉండదంటే అందరు సరే అనుకున్నారు.

కానీ హఠాత్తుగా ఓ హోటల్లో ముఖ్యనేతలతో మీటింగ్ పెట్టారు. ముందుగా అనుకున్న 15 నిముషాల మీటింగ్ కాస్త 40 నిముషాలు జరిగింది. అసలు టైమే లేదు మీటింగే రద్దన్న వాళ్ళు ముందుచెప్పిన 15 నిముషాలకన్నా అదనంగా 25 నిముషాలు ముఖ్యులతో మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు ? ఇక్కడే ముఖ్యనేతలతో అమిత్ మీటింగ్ స్పెషల్ పర్పస్ ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. పార్టీ నేతల సమాచారం ప్రకారం మీటింగ్ స్పెషల్ పర్పస్ ఏమిటంటే వచ్చేఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిందే అని అమిత్ మరోసారి చెప్పారట.

కేసీయార్ తో కొట్లాడటం ద్వారా జనాల్లో బీజేపీ అంటే నమ్మకం పెంచుతారా లేకపోతే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయటం ద్వారా జనాలను బీజేపీకి ఓట్లేసేట్లు చేస్తారో మీరే తేల్చుకోండని ముఖ్యనేతలకే అమిత్ వదిలేశారట. మార్గం ఏదైనా సరే వచ్చేఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడాలన్నది నరేంద్రమోడీ ఆలోచనగా అమిత్ చెప్పారట.

పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత సమస్యలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చి కేసీయార్ పై పోరాటాలు చేయాలని దిశానిర్దేశం చేశారట. ఇప్పుడు గనుక అదికారంలోకి రాలేకపోతే ఆ తర్వాత వచ్చేఎన్నికల నాటికి పరిస్ధితులు ఎలాగ మారుతాయో ఎవరు చెప్పలేరని అందరికీ గట్టిగానే అమిత్ హెచ్చరించారట. ఇతర పార్టీల్లోని వీలైనంతమంది ప్రముఖ నేతలను బీజేపీలోకి చేర్చుకోవటానికి ప్రయత్నాలు జరగాలని గట్టిగా చెప్పారట. ప్రజలకు చేరువవ్వటం ద్వారా మాత్రమే అదికారంలోకి రాగలమన్న విషయాన్ని ముఖ్యనేతలందరికీ అమిత్ స్పష్టంగా చెప్పారట. అమిత్ నిర్దేశం చూస్తుంటే తొందరలోనే కేసీయార్ వ్యతిరేక పోరాటాలను బీజేపీ మరింత ఉధృతం చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.