అప్పుల ఆంధ్రప్రదేశ్..రియల్లీ గ్రేట్

ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అంతకంటే ముందు వచ్చే తెలుగు అక్షరం అ అంటే మాత్రం అప్పుల అప్పారావు అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం తెలిసిపోయింది. ఇక పైసా లేదు. ఎలా చేస్తాడో ఏమిటో అని స్వపక్షం టెన్షన్, విపక్షం ఆనంద పడుతున్న టైమ్ లోనే సీఎం జగన్నోహన్ రెడ్డి వేల కోట్లు అప్పు తెచ్చేస్తారు. ఏ నెలకు ఆ నెల ఎలా సాగుతుందోనని జనం టెన్షన్ పడుతుండొచ్చు.. జగన్ మాత్రం నవ్వుతూనే ఢిల్లీ నుంచి క్యాష్ డౌన్ చేస్తారు..

గత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు పది లక్షల కోట్లు. అందులో సగం జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు. అందులోనూ 90 శాతం వరకు అనుద్పాదక వ్యయం కోసం తీసుకున్న రుణంగా ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంగతిని కాసేపు పక్కన పెడితే ఈ ఆర్థిక సంవత్సరంలో జగన్ చేసిన అప్పు ఎంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.

2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ ఏడాది అప్పులు మొదలయ్యాయి. మార్చి ఆఖరి వారంలోనే కేంద్రం వద్ద మూడు వేల కోట్ల అప్పు పుట్టించుకున్న జగన్ రెడ్డి, దాన్ని కొత్త ఏడాది ఖాతాలో వేసుకుంటామని కూడా వాళ్లతో చెప్పించారు. నవ్వుకుంటూ ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసే జగన్ వచ్చేప్పుడు అప్పు చేతపట్టుకుని వస్తారని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు తాజాగా వేర్వేరు వడ్డీ రేట్లు , పేమెంట్ షెడ్యూల్ కింద మరో రూ. 3 వేల కోట్ల అప్పు పుట్టించుకున్నారు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ బాండ్ల వేలం ద్వారా ఏపీకి అప్పు జమ అవుతుంది మే ఒకటో తేదీ వరకు చెల్లింపులు పూర్తవుతాయి. కొంత సొమ్ము మిగిలితే జీతాలు, పెన్షన్లు ఇవ్వాల్సిన వారిలో కొందరి జమ అవుతాయి..

ప్రతీ నెల ఏపీ ఉద్యోగుల జీతాలకు రూ. 5,500 కోట్లు అవసరం. సామాజిక పెన్షన్లకు అటు ఇటుగా మరో రూ. 2 వేల కోట్లు చెల్లించాల్సి రావడం ఖాయం. అంటే ఒకటో తారీఖు తర్వాత మళ్లీ ఓ సారి బాండ్ల వేలం ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం మరోకటి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎఆర్బీఎం పరిమితిని ఇంకా కేంద్ర ప్రకటించలేదు. గతేడాది రూ. 44 వేల కోట్లు ఎఫ్ఆర్బీఎం పరిమితి రాగా, దాన్ని దాటి పోయి అదనంగా రూ. 17 వేల కోట్లు రుణం పొందారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఎఆర్బీఎం పరిమితి వస్తే ముందే తీసుకున్న రూ. 17 వేల కోట్లకు తోడు, ఇప్పుడు తీసుకున్న రూ. 6 వేల కోట్లు మినహాయించి మరో రూ. 21 వేల కోట్లు అప్పుకు అనుమతించే వీలుంది.

ఎఫ్ఆర్బీఎం అనుమతులు వస్తే మూడు నెలల వరకు ఇబ్బంది ఉండదు. అయినా భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే నవ్వుతూ, మెలికలు తిరుగుతూ ఢిల్లీ వెళ్లే జగన్ ఏదో విధంగా అప్పు పుట్టించుకుని రాగలరు. ఆయనతో ఉన్న సమస్య ఒక్కటే. ప్రతీ నెల ఉద్యోగుల జీతాల కోసం 12 నుంచి 15వ తేదీ వరకు నిరీక్షించక తప్పదు. నిరీక్షణ తర్వాత చేతికంటే డబ్బును చూసుకుంటే వచ్చే ఆనందమే వేరప్పా అనుకోవడమే.. ఈ లోపు రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా దివాలా తీసినా.. పట్టించుకోకూడదు. ఆ ఒక్క విషయంలో క్లారిటీ ఉంటే చాలు…