గన్నవరం టికెట్ ఇస్తే రూ.150కోట్లు ఖర్చుకు రెఢీగా ఉన్నారట

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీడీపీ సీనియర్ నేత.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయన ఏం చేసినా.. మరేం మాట్లాడినా సంచలనం అన్నట్లుగా ఉంటుంది. తాజాగా ఆయన గన్నవరం అసెంబ్లీ స్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు ఒక వ్యక్తి వచ్చారని.. గన్నవరం సీటును తనకు ఇస్తే.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సదరు వ్యక్తి చెప్పారన్నారు.
అయితే.. గన్నవరం నియోజకవర్గం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతామన్న చింతమనేని.. ఓట్లకు ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు మీసం మెలేసే దమ్మున్న వ్యక్తిని బరిలోకి దింపుతామని పేర్కొన్నారు. ఒకరు పోతే వంద మంది వస్తారంటూ వల్లభనేని వంశీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డిలు నిర్దోషులుగా వస్తారంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని.. అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టింది చంద్రబాబు కాదని.. స్వయాన సీబీఐ పెట్టిందని గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డి ప్రమేయం లేకుంటే సీబీఐ కేసు ఎందుకు పెడుతుంది? అని ప్రశ్నించారు. జగన్ చెల్లి సునీత మీపై కేసు పెట్టిందంటే హత్య ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చన్న చింతమనేని.. ‘అవినాశ్ రెడ్డి అరెస్టు అనగానే ముఖ్యమంత్రిజగన్ ఢిల్లీ వెళ్లిపోతున్నారు. ప్రధాని మోడీ.. హోం మంత్రి అమిత్ షాలను కలిసి కాళ్లు పట్టుకొని మీడియాకు మాత్రం రాష్ట్ర విభజన హామీల కోసం అని చెప్పటం విడ్డూరంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.

సొంత చెల్లిలినే రాష్ట్రం నుంచి వెళ్లగొడితే పక్క రాష్ట్రంలోకి వెళ్లి పార్టీ పెట్టుకున్నారన్న చింతమనేని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చింతమనేని చేసిన హడావుడిపై పలువురు మండిపడుతున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీవార్డులోకి వందల మందితో వచ్చి పండ్లు పంచే కార్యక్రమాన్ని చేపట్టటంపై పలువురు మండిపడుతున్నారు. ఐసీయూలోకి మామిడి పండ్లను బండితో తీసుకెళ్లి పంచే ప్రోగ్రాంను చూసి.. రోగులు.. వైద్యులు ఆశ్చర్యపోయారంటున్నారు. సాధారణంగా ఐసీయూలోకి బయట వాళ్లను ఎవరిని అనుమతించరు. అందుకు భిన్నంగా పుట్టిన రోజు సందర్భంగా చింతమనేని చేసిన హడావుడిని పలువురు తప్పు పడుతుండటం గమనార్హం.