అవినాష్‌ను ఈ నెల 25 వ‌ర‌కు అరెస్టు చేయొద్దు: తెలంగాణ హైకోర్టు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విష‌యం ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందే తెలుసున‌ని సీబీఐ అధికారులు వాద‌న‌లు వినిపించారు. తెలంగాణ హైకోర్టులో జ‌రిగిన అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌ల సంద‌ర్భంగా మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. అయితే.. కోర్టు మాత్రం ఎన్ని ఉన్నా.. ఈ నెల 25 వ‌ర‌కు ఎంపీని అరెస్టు చేయొద్ద‌ని తేల్చి చెప్పింది. అయితే.. విచార‌ణ‌కు మాత్రం ఎంపీ హాజ‌రుకావాల్సిందేనని.. విచార‌ణ‌ను రికార్డు చేయాల‌ని.. ఎంపీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు అనుమ‌తించాల‌ని ఆదేశించింది. దీంతో ఎంపీ అవినాష్‌కు కొంత ఊర‌ట ల‌భించింద‌ని ఆయ‌న వ‌ర్గాలు తెలిపాయి.

సీబీఐ వాద‌న‌లు ఇవీ..

అవినాష్‌ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సీబీఐ త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరారు. వివేకా హత్య కుట్ర అవినాష్‌రెడ్డికి ముందే తెలుసని కోర్టులో వెల్లడించారు. గత నాలుగు విచారణల్లో ఆయన సహకరించలేదన్నారు. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. హత్యకు ముందు.. ఆ తర్వాత అవినాష్‌ ఇంట్లో సునీల్‌ యాదవ్‌, ఉదయ్‌ ఉన్నారని ఆరోపించారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్‌రెడ్డి జమ్మలమడుగుకు దగ్గర్లో ఉన్నట్లు చెప్పారనీ… మొబైల్‌ సిగ్నల్స్‌ చూస్తే ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోందని కోర్టుకు తెలిపారు. ఆ రాత్రంతా తన ఫోన్‌ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించినట్లు సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టుకు వస్తున్నారని వైఎస్ వివేకా కుమార్తె సునీత కోర్టుకు తెలిపారు. అవినాష్ ప్రమేయంపై నిందితులు, సాక్ష్యులు సీబీఐకి చెప్పారని వెల్లడించారు.

అవినాష్ త‌ర‌ఫున వాద‌న‌లు ఇవీ..
అనంతరం అవినాష్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్పై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. దర్యాప్తులో గూగుల్ టేకౌట్ డేటాపై ఆధారపడటం తగదన్నారు. సునీల్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయన్నారు. దస్తగిరి చెప్పింది తప్పా.. గూగుల్ డేటా తప్పా..? అని కోర్టుకు సూచించారు. వివేకా హత్యకు కుటంబ, వివాహేతర, ఆర్థిక వివాదాలు కారణమై ఉండొచ్చని కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణపై స్పష్టత ఇవ్వాలని అవినాష్రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి సీబీఐ త‌ర‌ఫున న్యాయ‌వాది స్పందిస్తూ.. కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు పిలుస్తామని సీబీఐ తెలిపింది.

గుండెపోటు మా సృష్టి కాదు!
బంధువు కనుక హత్యాస్థలానికి వెంటనే వెళ్లినట్లు అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. గుండెపోటు అని ఎందుకు చెప్పారని హైకోర్టు ప్రశ్నించగా.. అక్కడున్న వారు చెబితే అదే విషయం చెప్పినట్లు అవినాష్ న్యాయవాది స్పష్టం చేశారు. గుండెపోటు అనేది అవినాష్ సృష్టి కాద‌న్నారు. వాదనల అనంతరం ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.