వాళ్లిద్దరూ స్పందించరా.. ?

పోయినోళ్లు అందరూ మంచోళ్లే… ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులే.. అని ఒక ఫేమస్ సినిమా సాంగ్ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో మాత్రం అది పాడకుండా ఉంటే మంచిదనకోవాలి.. ఎందుకంటే మంత్రిగా, ఎంపీగా సేవలందించిన వివేకా దారుణ హత్యకు గురైతే నిజానిజాలు వెలికి తీయడంలో సహకరంచాల్సిన దగ్గరి బంధువులే ఇప్పుడు అయనో స్త్రీ లోలుడని ప్రచారం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పైనా, ఆయన కుటుంబంపైనా టన్నుల కొద్దీ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు..చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు..

వివేకా కేసును సీబీఐ హ్యాండిల్ చేయడం మొదలైన తర్వాత అవినాష్ రెడ్డి తెగ టెన్షన్ పడిపోతున్నారు. వివేకా ఒక ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారని, ఒక కొడుకు కూడా ఉన్నాడని అవినాష్ తొలుత ఆరోపించారు. ఆస్తి తగాదాలతోనే వివేకాను చంపేశారని ఆయన అన్నారు. ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన కీచకుడని మరిన్ని ఆరోపణలు చేశారు. వివేకా కేసులో ఒక నిందితుడి తల్లితో. మరో నిందితుడి భార్యతో ఆయనకు వివాహేతర సంబంధాలుండేవని, అదే హత్యకు దారితీసిందని అవినాష్ ఆరోపించారు..

అవినాష్ రెడ్డి ఇన్ని ఆరోపణలు చేస్తున్నా.. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రం నోరు మెదపడం లేదు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్రలతో అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల ఒక్క సారి మాత్రమే ఆ కేసుపై స్పందించారు. నిజానిజాలు తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందని ఆమె అన్నారు. ఇప్పుడు వివేకాకు వివాహేతర సంబంధాలున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో షర్మిల వాటిని ఖండించేందుకు ప్రయత్నించడం లేదు. ఆమె తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా మాట్లాడటం లేదు. కుమారుడు జగన్ మీద అలిగి హైదరాబాద్ వచ్చి కూతురు షర్మిల దగ్గర ఉంటున్న విజయలక్ష్మీ .. వివేకా కేసుపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

వైఎస్ సొంత సోదరుడిని దారుణం చంపారన్న నిజం బయట పడిన తర్వాత కూడా ఆ ఇద్దరు స్పందించలేదు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు అండగా ఉంటామన్న నమ్మకమూ కలిగించలేకపోయారు. వైఎస్ వంశం పురువే పోతున్నప్పటికీ తమ దృష్టికి ఏ అంశమూ రావట్లేదన్నట్లుగానూ, తాము అసలు పేపర్లు చదవం, టీవీలు చూడం అన్నట్లుగానూ ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ వారెందుకు మౌనం వహిస్తున్నారు ? జగన్ కు భయపడి నోరు మెదపడం లేదా.. అంటే కూడా ఖచితంగా చెప్పలేం.. ఎందుకంటే లోగుట్టు పెరుమాళ్ కెరుక అంటారు కదా….