జేడీ లక్ష్మీనారాయణ.. ఇలా తయారయ్యాడేంటి?

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులను డీల్ చేయడం, ఆయన్ని అరెస్టు చేయడం ద్వారా జనాల్లో పెద్ద హీరో అయిపోయారు లక్ష్మీ నారాయణ. నిజానిని ఇనిషియల్ వి.వి. అయినప్పటికీ సీబీఐ పదవి అయిన ‘జేడీ’నే తర్వాతి కాలంలో ఆయన ఇంటి పేరుగా మారింది. నిజానికి లక్ష్మీనారాయణ చట్ట ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏం చేయాలో అది చేశారు తప్పితే.. సినిమాల్లో మాదిరి సొంతంగా ఈ కేసులో చేసిందేమీ లేదు. కానీ జనాలు మాత్రం ఆయన్ని వేరే దృష్టితో చూశారు. హీరోని చేశారు.

ఐతే చాలామంది మాజీ ఐపీఎస్ అధికారుల్లాగే రిటైరయ్యాక రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనారాయణ పెద్దగా అంచనాలను అందుకోలేకపోయారు. జనసేన తరఫున వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. తర్వాతి కాలంలో సిల్లీ కారణాలు చెప్పి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. అప్పట్నుంచి సొంత ఇమేజ్ కోసం తన ప్రయత్నాలేవో తాను చేస్తున్నారు.

ఐతే ప్రజల్లో సెంటిమెంటుగా మారిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని తీసుకుని రాజకీయంగా ఎదగాలని లక్ష్మీనారాయణ కొంత కాలంగా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఐతే ఈ క్రమంలో సగటు రాజకీయ నాయకుల్లాగే ఆయన కూడా వ్యవహరిస్తుండటం.. తన స్థాయికి తగని మాటలు, చేతలతో కాస్త విజ్ఞానం ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుండటమే చర్చనీయాంశం అవుతోంది. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను కొనడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సొంతంగా బిడ్ వేయలేదని జేడీ స్థాయి వ్యక్తికి తెలియంది కాదు. అయినా సరే.. బిడ్ వేస్తామని తెలంగాణ సర్కారు ప్రకటిస్తే జేడీ స్వాగతించారు. కేసీఆర్ మీద ప్రశంసలు కురిపించారు.

ఇదే విడ్డూరం అంటే.. జేడీ సొంతంగా ఒక ఫర్మ్ ఏర్పాటు చేసి జనాల నుంచి విరాళాలు కోరుతున్నారు. ఏపీలో ఉన్న ప్రతి కుటుంబం నెలకు వంద రూపాయలు ఇస్తే.. రూ.850 కోట్లు జమ అవుతాయని.. ఆ డబ్బుతో సొంతంగా బిడ్ వేద్దామని ఆయనంటున్నారు. లక్షల కోట్లు ఎక్కడ.. రూ.850 కోట్లు ఎక్కడ..? పైగా ఇలా బిడ్ వేయడానికి కూడా నిబంధనలు ఒప్పుకోవు. ఆ సంగతి కూడా లక్ష్మీనారాయణకు తెలియంది కాదు. అయినా సరే.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటే జనాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి.. తనేదో విశాఖ ఉక్కు కోసం తెగ పోరాడేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికే తప్ప మరొకటి కాదు. లక్ష్మీనారాయణకు ఉన్న ఇమేజ్‌కు ఆయన మాటలు, చేతలకు అస్సలు పొంతన ఉండట్లేదని వేరే చెప్పాలా?