వైసీపీకి మ‌రో ఉచ్చు.. ప‌దునెక్కిన ‘కోడిక‌త్తి’!!

ఏపీలో మ‌రో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీకి ఒక‌దానిపై ఒక‌టి ఉచ్చులు పెరుగుతున్నాయి. ఒక‌వైపు.. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు క‌త్తి వైసీ పీపై వేలాడుతూనే ఉంది. దీనిని గ‌త ఎన్నిక‌ల్లో సింప‌తీకి వాడుకున్నారు. చంద్ర‌బాబే చంపించార‌ని పెద్ద ఎత్తున యాగీ చేశారు. మొత్తానికి ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందారనే వాద‌న ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తూనే ఉంది.

ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో కేసు.. సీఎం జ‌గ‌న్‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. అదే.. 2018లో విశాఖ‌లో జ‌రిగిన కోడిక‌త్తి కేసు. దీనిని కూడా అప్ప‌ట్లో జ‌గ‌న్ అండ్ కోలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య త్నం చేసి స‌క్సెస్ అయ్యార‌ని టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కేసులోనే వైసీపీ అడ్డంగా ఇరుక్కుపోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఈ కేసులో ఎన్ ఐఏ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌ను ప‌రిశీలిస్తే..అనేక ప్ర‌శ్న‌లు జ‌గ‌న్ చుట్టూ.. వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి.

జగన్‌కు ప్రజల్లో సానుభూతి కల్పించేందుకే దాడి చేశానని, ఆయన సీఎం అవ్వాలనేదే తన ఉద్దేశమని నిందితుడు శ్రీనివాసరావు తన వాంగ్మూలంలో చెప్పాడు. అయినా.. ఆయనంతట ఆయనే దాడి చేశాడా..? అనేది ప్ర‌శ్న‌. ప‌ట్టు మ‌ని పాతికేళ్లు కూడా లేకుండానే అంత పెద్ద ప్లాన్‌ ఎలా వేశాడ‌న్న‌ది.. చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం. ఈ క్ర‌మంలోనే ఏదైనా శక్తులు, వ్యక్తుల ప్రోద్బలం ఏమైనా ఈ దాడి వెనుక ఉందా..? అనేది కీల‌కంగా మారింది.

జ‌గ‌న్ గాయానికి చికిత్స చేసిన హైద‌రాబాద్‌లోని సిటీన్యూరో సెంటర్ డాక్టర్‌ సాంబశివారెడ్డిని వైసీపీ అధికారంలోకి రాగానే.. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా, ఆ తర్వాత ఆరోగ్య శ్రీ ట్రస్టు వైస్‌ ఛైర్మన్‌గా నియమించారు. మ‌రి ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

నాటి ఘ‌ట‌న త‌ర్వాత‌.. నిందితుడు శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలో రేషన్‌ దుకాణాల్లో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, పింఛన్లు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని రాశారు. వారికి ఇంటికే పింఛను, రేష‌న్ ఇస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు. చిత్రంగా..ఇప్పుడు వైసీపీ హ‌యాంలో అవే జ‌రుగుతున్నాయి. మ‌రి.. ఆ లేఖ‌కు, ప్ర‌స్తుత పాల‌న‌కు అవినాభావ సంబంధం ఉందా? అనేది ఇంట్ర‌స్టింగ్. ఏదేమైనా ఇలా అనేక ప్ర‌శ్న‌లు ఇప్పుడు వైసీపీ వైపే వేళ్లు చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.