ఎన్నికల ముందు బీజేపీకి షాక్

సరిగ్గా ఎన్నికల ముందు రిజర్వేషన్ల అమలు విషయంలో కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. లింగాయతులు, ఒక్కలిగలకు బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని పక్కనపెట్టేసింది. కర్నాటకలో ఓబీసీ ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ బసవరాజ బొమ్మై ప్రభుత్వం రద్దుచేసింది. అలా రద్దుచేయగా మిగిలిపోయిన 4 శాతం రిజర్వేషన్లో 2 శాతం లింగాయతులకు మిగిలిన 2 శాతం ఒక్కలిగలకు సర్దుబాటుచేసింది. బొమ్మై ప్రభుత్వం చేసిన ఈ చర్య పూర్తిగా రాజకీయలబ్ది కోసమే అని అందరికీ తెలుసు.

ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతోనే లింగాయతులు, ఒక్కలిగలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచేసింది. దానిపై కోర్టులో ఎవరో సవాలు చేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రింకోర్టు తప్పుపట్టింది. ఏ ఆధారంతో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేశారని నిలదీసింది. ఒక్కలిగలు, లింగాయతలకు రిజర్వేషన్ల శాతం ఏ ప్రాతిపదికన పెంచారన్న సుప్రింకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.

దాంతో పై సామాజికవర్గాలకు పెంచిన రిజర్వేషన్లను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ లాయర్ హామీ ఇచ్చారు. నియామకాలు, అడ్మిషన్లలో లింగాయతులు, ఒక్కలిగలకు పెంచిన 2 శాతం రిజర్వేషన్లను నిలిపేస్తామని లాయర్ చెప్పారు. దాంతో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లే. ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో ఒక్కలిగలు, లింగాయతుల ఓట్లే కీలకం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వీళ్ళ మద్దతుంటే మాత్రమే రాగలదు. సమాజంలో అతిపెద్ద సామాజికవర్గం లింగాయతులైతే వీళ్ళ తర్వాత సామాజికవర్గం ఒక్కలిగలు.

ఒక్కలిగల శాతం 15 శాతముందంటే లింగాయతులు అంతకన్నా ఎక్కువే ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మద్దతు కోసమే బీజేపీ ప్రభుత్వం హడావుడి ముస్లిం రిజర్వేషన్ రద్దుచేసి పై రెండు సామాజికవర్గాలకు కలిపింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేది అనుమానమే అంటున్నారు. అధికారంలోకి రాకపోతే బీజేపీకి చాలా ఇబ్బందవుతుంది. అందుకనే అధికారంలోకి రావటానికి అందుబాటులో ఉన్న ప్రతిమార్గాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగమే ఒక్కలిగలు, లింగాయతులకు రిజర్వేషన్ పెంచటం. దాన్ని సుప్రింకోర్టు అడ్డుకున్నది. మరి ఎన్నికల్లో దీన్ని ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.