వైసీపీ ఫోకస్ మారింది.. టీడీపీ, జనసేన కాదు టార్గెట్ బీఆర్ఎస్

ఏపీ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా… పాలకవిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు.. తిట్లు, బూతుపురాణాలు, నిరసనలు, ధర్నాలు, అరెస్టులు, నిర్బంధాలు, అడ్డుకోవడాలు.. ప్రతిరోజూ పొలిటికల్ పండగే అక్కడ. అధికారపక్షం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల సమస్యల కంటే విపక్ష నేతలపై ఎదురుదాడికే సమయమంతా సరిపోతుంది. అధికారం పక్షం కొట్టే దెబ్బల నుంచి బయటపడేందుకు విపక్షం కూడా రోజూ డిఫెన్స్, కౌంటర్ అఫెన్స్ కార్యక్రమాలలోనే ఉంటుంది. నిర్మాణాత్మక రాజకీయాలనేవే లేకుండా పోయిన రాష్ట్రమది.

ఇలాంటి పరిస్థితులలో ఉన్నది చాలదన్నట్లు పొరుగు రాష్ట్రం తెలంగాణలోని అధికార పక్షం బీఆర్ఎస్ జాతీయ కలలు కంటుండడంతో పక్కనే ఉన్న ఏపీలో అడుగుపెట్టేందుకు ఆరాటపడుతోంది. ఆ క్రమంలోనే ఏపీలో ప్రస్తుత వైసీపీ పాలనపైన, విశాఖ ఉక్కుపైన కామెంట్లు చేస్తోంది. దీంతో ఏపీలో అధికార పక్ష నేతలు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల చర్యలకు, మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ నేతలకు కొత్తగా ఈ పని తగలడంతో టీడీపీపై దండయాత్ర ఆగింది. దీంతో చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలకు కాస్త ఊపిరి పీల్చుకునే టైం దొరికింది. ఆ రకంగా బీఆర్ఎస్ వచ్చి టీడీపీకి కాస్త రెస్ట్ ఇచ్చినట్లయింది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి,బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించ‌డం ఏపీలోని అధికార పార్టీ వైసిపికి మింగుడు ప‌డ‌టం లేదు.. కేటీఆర్ సైతం ప్రెస్ మీట్ ప్ర‌భుత్వ రంగ స్థంస్థ మ‌నుగ‌డ‌కు త‌మ‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాంటూ చెప్పండంతో వైసిపి అలెర్ట్ అయింది.. ఆ వెంట‌నే సీన్లోకి వ‌చ్చిన వైసిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్టారెడ్డి గ‌తంలో జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్నే కెటిఆర్ ప్ర‌స్తావించారంటూ ఆ క్రెడిట్ జ‌గ‌న్ ఖాతాలో వేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇక సింగ‌రేణి బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగుపెట్టిన వెంట‌నే వైసిపి స్వ‌రాన్ని మరింత పెంచింది. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ బిఆర్ఎస్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొన‌డం అంటే ప్రైవేటీక‌ర‌ణ‌కు బిఆర్ఎస్ జై కొట్ట‌డ‌మే నంటూ ఆ పార్టీని విమ‌ర్శించారు.

రాజ‌కీయ ఎంట్రీ కోస‌మే స్టిల్ ప్లాంట్ అంశాన్ని కెసిఆర్ భుజాన వేసుకున్నార‌ని భావిస్తున్న వైసిపి ఇప్ప‌డు డిఫెన్స్ వాదాన్ని తెర‌పైకి తెచ్చారు.. మంత్రులు కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, సీదిరి అప్ప‌ల‌రాజు, పార్టీ కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి త‌దిత‌రులు బిఆర్ఎస్ తీవ్ర‌ప‌ద‌జాలంతో విమ‌ర్శలకు పదును పెట్టారు.

ఓ వైపు స్టీల్ ప్లాంట్ రచ్చ నడుస్తుండగానే తెలంగాణకు చెందిన మరో మంత్రి హరీశ్ రావు ఏపీలో రోడ్లే స‌రిగా ఉండ‌వ‌ని కామెంట్ చేశారు. దీంతో ఆయనపై ఏపీ మంత్రి కారుమూరి అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు.. ఏపీకి రా మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపిస్తామ‌ని మంత్రి కారుమూరి స‌వాలు విసిరారు. త‌మ రాష్ట్రం గురించి దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ తన నోటికి పనిచెప్పారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగానలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్‌ వన్‌లో ఉన్నాం. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ హరీష్ కు కౌంటర్ ఇచ్చారు.

ఇక మ‌రో మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజు కూడా బిఆర్ఎస్ పైనా, ఇక్క‌డి మంత్రుల‌పైనా ఫైర్ అయ్యారు.. తెలంగాణ‌లో విప‌క్షాల దాడికి త‌ట్టుకోలేకే ఎపిపై పండారంటూ ఎత్తిపొడిచారు.. బిఆర్ఎస్ కు ఎపి ప్ర‌జ‌ల బ‌ద్ద వ్య‌తిరేక పార్టీ అని, అ పార్టీకి ఇక్క‌డ చోటు లేదంటూ చెప్పేశారు.. అక్క‌డ అభివృద్ధి ముసుగులో అరాచ‌కం కొన‌సాగుతుందంటూ కెసిఆర్ పాల‌న‌ను దుమ్మెత్తి పోశారు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కనబడటం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ఏపీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అల్లుడు, కూతురు అందరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. మొన్న‌టి వ‌ర‌కు వైసిపి, బిఆర్ఎస్ స‌ఖ్య‌త‌గా ఉన్నా స్టీల్ ప్లాంట్ వ్య‌వ‌హారంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య ఇప్పుడు మాట‌ల య‌ద్ధం హై టెన్ష‌న్ పుట్టిస్తున్న‌ది.. వైసిపి తాజాగా అక్క‌డ ప్ర‌తిప‌క్ష‌పార్టీలు జ‌న‌సేన‌,తెలుగుదేశంపై కంటే బిఆర్ ఎస్ పైనే దృష్టి సారించింది.