దొర‌ల గ‌డీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టుంది: జూప‌ల్లి

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ నేత‌గా ఉన్న జూప‌ల్లి కృష్ణారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న పై పార్టీ అధిష్టానం వేటు వేసిన విష‌యం తెలిసిందే. దొర‌ల గ‌డీ నుంచి తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్టు ఉంద‌ని అన్నారు. అయితే.. అదేస‌మ‌యంలో తాను సంధించే ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌ని.. ఆ త‌ర్వాతే త‌న‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆయ‌న అల్టిమేటం జారీ చేశారు.

“న‌న్ను స‌స్పెండ్ చేశార‌ని తెలిసింది. పంజరంలో నుంచి బయటపడినట్లు ఉంది” అని అన్నారు. అయితే.. తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. అదే స‌మ‌యంలో ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేయాల‌ని జూప‌ల్లి అన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే తనను సస్పెండ్ చేశారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏం జ‌రిగింది?

గ‌త కొన్నాళ్లుగా.. జూప‌ల్లి, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిలు బీఆర్ఎస్‌పై ర‌గిలిపోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ కూడా చేతులు క‌లిపారు. ఆదివారం త‌మ‌ అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులోసీఎం కేసీఆర్, మంత్రి కేసీఆర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక‌.. జూప‌ల్లి కూడా త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని, త‌న‌పై గెలిచిన వ్య‌క్తిని పార్టీలో చేర్చుకున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆత్మీయ సమ్మేళనంలో.. జూప‌ల్లి, పొంగులేటిలు బీఆర్ ఎస్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్ద‌రినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధినేత కేసీఆర్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందన ఇరువురిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.