సెల్ఫీలు కోట్లాడుతున్నాయ్‌.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ స‌ర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట మూ డు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల జోన‌ల్ స‌మావేశాల‌ను ఆయన చేప‌ట్టారు. త‌ద్వారా.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు..నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో తాను ప‌ర్య‌టిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హ‌యాంలో చేప‌ట్టిన కీల‌క‌ప‌థ‌కాలు… ప‌నుల‌కు సంబంధించి.. సెల్ఫీలు దిగుతున్నారు చంద్ర‌బాబు. వీటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. విశాఖ‌లో ఐటీ పార్కు వ‌ద్ద‌.. సెల్ఫీదిగిన చంద్ర‌బాబు .. త‌మ హ‌యాంలో ఐటీ ప‌రుగులు పెట్టింద‌ని.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంట‌ని సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.

అదేవిధంగా నెల్లూరులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. తాను సీఎంగా ఉన్న‌ప్పుడు.. పేద‌ల‌కు.. టిడ్కో ఇళ్లు క‌ట్టించామ‌ని.. ఇవి పూర్త‌య్యే ద‌శ‌లో ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయాని అంగీక‌రించారు. మ‌రి ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లు ఎందుకు పేద‌ల‌కు ఇవ్వ‌లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తమ హ‌యాంలో నే 85 శాతం పూర్త‌య్యాయ‌ని మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయ‌లేరా? అని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే టీడ్కో ఇళ్ల ముందు చంద్ర‌బాబు సెల్ఫీ తీసుకున్నారు.

దీనిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు. అయితే.. టీడీపీ అధినేత సెల్ఫీ చాలెంజ్‌ల‌పై ఆచితూచి స్పందించారు వైసీపీ మంత్రులు. నెల్లూరుకు చెందిన మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. టీడీపీ అధినేత‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సెల్ఫీలుకాద‌ని.. నేరుగా త‌మ‌తో చ‌ర్చ‌ల‌కు వ‌స్తే.. లెక్క‌లు చూపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, దీనిపై టీడీపీ నేత‌లు కౌంట‌ర్లు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఇలా.. మొత్తంగా.. సెల్ఫీల విష‌యం ఇరు పార్టీల మ‌ధ్య వివాదంగా మార‌డం గ‌మ‌నార్హం.