ఉంటే ఉండు.. లేకుంటే పో.. బొత్స ఫైర్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వచ్చింది. సమస్యల మీద సమస్యలు చెబుతున్న సొంత పార్టీకి చెందిన చోటా నేత మీద విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తీరు మీద కంప్లైంట్ చేస్తున్న ఆయన్ను వారించగా.. తాను చెప్పాల్సిన విషయాల్ని చెబుతున్న వైనం ఆయనకు పట్టలేనంత కోపాన్ని కలిగేలా చేసింది. దీంతో.. ఆయన సీరియస్ అయ్యారు. “పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో. ఏం మాట్లాడుతున్నావు? బాధలా.. ఏంటి నీ బాధలు. నీకేనా? మాకు లేవా బాధలు? ఇక్కడ బాగా క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయింది. నువ్వే పోటుగాడివా? వీళ్లందరికి చేతగాదనుకున్నావా రాజకీయం చేయటం?” అంటూ ఫైర్ అయ్యారు.

ఇంతకూ మంత్రి బొత్సకు ఎందుకంత కోపం వచ్చింది? అసలే జరిగిందన్న విషయంలోకి వెళితే.. విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి బొత్స హాజరయ్యారు. ప్రోగ్రాం అయ్యాక తిరిగి వెళుతున్న ఆయన వద్దకు పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రెహ్మాన్ వెళ్లారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసి.. ఓడించినోళ్లకు పదవులు వచ్చాయి. వారిప్పుడు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇలా చేస్తే.. పార్టీకి మొదట్నించి ఉండి.. పార్టీని నమ్ముకున్న మాలాంటోళ్ల పరిస్థితేంటి? అలాంటోళ్ల కారణంగా నియోజకవర్గంలో చాలా బాధలు పడుతున్నామని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజుపై మంత్రి బొత్సకు కంప్లైంట్ చేశారు.

ఆ సమయంలో ఎమ్మెల్యే కడుబండి సదరు నేత పక్కనే ఉన్నారు. ఇలాంటివి మాట్లాడటానికి ఇది టైం కాదు.. విజయనగరం వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఇదే సమయంలో రహమాన్ ఇంకేదో చెప్పబోతుంటే.. సీరియస్ అయిన మంత్రి బొత్స.. “ఉంటే పార్టీలో ఉండు.. లేదంటే లేదు” అంటూ అందరి ముందు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో రహమాన్ కు బిత్తరపోయిన పరిస్థితి. అయితే.. అందరి ముందు ఎమ్మెల్సీ గురించి తనకు కంప్లైంట్ చేయటం సరి కాదన్నది బొత్స భావన అయితే.. అందరిముందు పార్టీ నేతను పట్టుకొని అంతలా అనేయటం సరైనదా? అంటూ మంత్రి తీరును పలువురు తప్పు పడుతున్నారు.