గోదావరిలో టికెట్ల పంచాయతీ…

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తుగా కొన్ని టికెట్ల పంపిణీ మొదలుపెట్టేశారు. తొలుత నారా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. తర్వాత ఆ విషయంలో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడ చంద్రబాబు ఏకమొత్తంగా కాకుండా అక్కడక్కడా అభ్యర్థుల పేర్లు చెబుతున్నారు. అదే క్షేత్ర స్థాయిలో టీడీపీ ఇబ్బందులకు కారణమవుతోందని చెబుతున్నారు.

చిన్నరాజప్ప పేరు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆశావహులు ఎక్కువగా ఉండటం, ఎవరికి వారే సమర్థులైన అభ్యర్థులు అనుకోవడంతో పోటీ బాగా పెరిగింది. పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప పోటీ చేస్తారని ఇటీవల తన పర్యటనలో చంద్రబాబు ప్రకటించారు. నిజానికి చిన్నరాజప్ప ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. ప్రజల మనిషిగా పేరుంది. కాకపోతే ప్రతీసారి ఆయనకేనా అన్న ధోరణిలో కొందరు నేతలు ఆగ్రహం చెందుతున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు పెట్టి, ఖర్చులు చేసి, మీడియా పబ్లిసిటీ చేసుకున్న వారికి చిన్నరాజప్ప అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం సుతారమూ నచ్చలేదు. వాళ్లంతా ఇప్పుడు చాపకింద నీరులా అసమ్మతి రాగాలు ఆలాపిస్తున్నట్లు చెబుతున్నారు.

జ్యోతుల నెహ్రు గ్రూపు

గోదావరి జిల్లాల్లో జ్యోతుల నెహ్రు ఒక పవర్ సెంటర్ గా ఉన్నారు. జగ్గం పేట మాజీ ఎమ్మెల్యే అయిన ఆయనతో పాటు ఆయన తనయుడు నవీన్ కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల టీడీపీలో చక్రం తిప్పుతున్నారు. దానితో చాలా మంది టీడీపీ నేతలకు వారి వైఖరి నచ్చడం లేదు. జ్యోతుల నెహ్రు కారణంగా ముమ్మిడివరం, కాకినాడ సిటీ, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలో అసమ్మతి పెరిగినట్లు చెబుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటున్నారు. ప్రతిపాడులో ఏకంగా వరుపుల రాజాకు సీటు ఇవ్వకూడదని చంద్రబాబు పర్యటన సందర్బంగానే ధర్నాలు జరిగాయి. పైగా పార్టీ అఫిషియల్ ప్రోగ్రాం కాని కార్యక్రమాలు కొందరు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన భయం

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నేతలకు జనసేన భయం పట్టుకుంది. ఏ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారో అర్థం కాక నేతలు తలపట్టుకు కూర్చుంటున్నారు. దానితో తమ పేరు ఎక్కువగా వినిపిస్తే నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేసిన పక్షంలో తమకే అవకాశం వస్తుందని కొందరు ఎదురు చూస్తూ ఏదోక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కొందరైతే పార్టీ నియోజకవర్గం ఇంఛార్జ్ లకు చెప్పుకుండా, వారిని పిలవకుండానే సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు…

అచ్చెన్న లేఖాస్త్రం

తూ.గో., జిల్లా నాయకుల తొందరపాటు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దాన్ని పరిష్కరించి, పార్టీకి ఇబ్బంది లేకుండా చూడాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఆయన ఆదేశించారు. నియోజకవర్గ ఇంఛార్జులకు తెలియకుండా, వారికి చెప్పకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని అచ్చెన్న ఒక లేఖ విడుదల చేశారు. ఇంఛార్జులు నిష్పాక్షితంగా పనిచేయాలని, ఎవరి ఒత్తిడులకు తలొగ్గాల్సిన అవసరం లేదని ఆ లేఖలో ఆదేశించారు. మరి ఇప్పటికైనా వాళ్లు దారికి వస్తారో లేదో చూడాలి…