కేసీఆర్ కు పోయే కాలమొచ్చింది: ఈటల

సుదీర్ఘకాలం సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పేరు చెప్పినంతనే.. గుర్తుకు వచ్చే ఈ తరం నాయకుల్లో ఈటల రాజేందర్ ఒకరు. ఉద్యమ కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన గళం విప్పిన తీరు.. చట్టసభల్లోఆయన చేసిన ప్రసంగాలు చాలానే ప్రభావితం చేశాయి. అప్పట్లో ఈటలను ఉద్దేశించి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆగ్రహంతో ఈటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యకు తెలంగాణ సమాజం తీవ్రంగా రియాక్టు కావటమే కాదు.. ఈ మాటను పట్టుకొని.. గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నెన్నిసార్లు మాట్లాడారో.. ఎంతలా విరుచుకుపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి ఈటల మీద సీఎం కేసీఆర్ కు కోపం వచ్చిన తర్వాత నుంచి ఆయన పరిస్థితి ఎంతలా మారిందో అందరికి తెలిసిందే. నిజానికి ఆయన్ను టార్గెట్ చేసిన వైనమే.. ఉప ఎన్నికల్లో అన్ని ప్రతికూలతల్లోనూ విజయం సాధించేలా చేసిందని చెప్పాలి. ఇప్పటికి ఆయన్ను టార్గెట్ చేసే ఏ చిన్న అవకాశం దక్కినా.. కేసీఆర్ సర్కారు ఆయనపై ఎంతలా విరుచుకుపడతారన్న దానికి నిదర్శనంగా రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది. పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి సంబంధించిన ఎపిసోడ్ లో బండి సంజయ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అర్థరాత్రి వెళ్లి అరెస్టు చేయటం ఒక ఎత్తు అయితే.. రోజు తర్వాత ఈటల రాజేందర్ కు నోటీసులు ఇవ్వటం.. ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించటం తెలిసిందే.

ఇలాంటి వేళ.. ఆయన రియాక్టు అయ్యారు. తన మనసులోని ఆగ్రహాన్ని మాటల్లో చూపించారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆచితూచి అన్నట్లుగా మాట్లాడే ఆయన.. అందుకు భిన్నంగా.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది’ అన్న తీవ్ర వ్యాఖ్యను చేశారు. తాను టెక్నాలజీకి అప్డేట్ కాలేదని.. మెసేజ్ లకు రిప్లై ఇవ్వనన్నారు. ‘ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే.. అది చూడకపోయినా.. నాకు నోటీసులు ఇచ్చారు. వేధించటానికే నోటీసులు ఇచ్చారు. నోటీసులకు.. జైళ్లకు భయడను. నోటీసులకు వివరణ ఇస్తా. సీఎం కేసీఆర్ కు పోయే కాలం వచ్చి. పోలీసుల్ని నమ్ముకున్నోళ్లు బాగుపడరు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’’ అంటూ ఫైర్ అయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్.. ప్రతిసారీ కేసీఆర్ తన చేతకానితనాన్ని పక్క వారి మీద రుద్దుతారన్నారు. ‘‘రూ.11వేల కోట్ల అభివృద్ధి పనులు చేయటానికి ప్రధాని వస్తున్నారు. ఆ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనటం లేదు. ప్రధానిని రాష్ట్రానికి ఆహ్వానించకుండా అబద్ధాల ప్రచారం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారు’’ అంటూ కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.