షర్మిలకు ఇచ్చి పడేసిన కామ్రేడ్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఏమైంది? తానేం చేసినా ఎదురు దెబ్బలే తప్పించి.. సానుకూల ఫలితాలు రావటం లేదన్న ఫస్ట్రేషన్ లో ఉన్నారా? రాజకీయాల్లో కనీసం పాటించాల్సిన గౌరవ మర్యాదల్ని ఆమె పాటించని వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు.. వారి తప్పులపై కలిసి పోరాడదామంటూ తెలంగాణ బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు పిలుపునివ్వటం.. వారు కుదరదని చెప్పటం తెలిసిందే.

కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ.. వారి వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు మిత్రులను వెతికే ప్రయత్నంలో ఉన్న ఆమె కమ్యూనిస్టులతో మాట్లాడేందుకు సీపీఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఇక్కడి వరకు సీన్ బాగున్నా.. షర్మిల నోటి నుంచి వచ్చిన మాటలు విస్మయానికి గురి చేసేలా చేశాయి.

తమను బీజేపీకి ‘బీ టీం’ మాదిరి పని చేస్తుననారని సీపీఎం కార్యదర్శి ఆరోపణలు చేయటం బాధాకరమని పేర్కొన్న షర్మిల కాస్తంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మిత్రత్వం కోసం వెళ్లిన పార్టీ నేతలను ఉద్దేశించి ఏ పార్టీ అధినేత విమర్శలు చేయరు. వియ్యం అందుకోవటానికి వెళ్లినోళ్లు కయ్యం పెట్టుకోరు కదా? కానీ.. షర్మిల మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ‘బీజేపీకి నేను బీ టీంలా పని చేస్తున్నాని సీపీఎం కార్యదర్శి ఆరోపణలు చేయటం బాధాకరం. గతంలో సీపీఎం చేపట్టినకార్యక్రమాలకు మేంరాలేదని వారు అంటున్నారు. వాస్తవానికి వారు నన్ను ఏ కార్యక్రమానికి పిలవలేదు. మాకు బీజేపీతో సంబంధాలు లేవని స్పష్టంగా చేస్తున్నాం. వామపక్షాలే భారాసకు బీటీంలా పని చేశాయి. తెర చాటు రాజకీయాలు చేస్తున్నాయి. వారిలా మేం ఏ పార్టీకి తెరచాటు రాజకీయాలు చేయలేదు.బీజేపీ మతతత్వ పార్టీ’’ అని వ్యాఖ్యానించారు.

తన ఎదుటే.. తనను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలతో తమ్మినేని వీరభద్రం ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి. షర్మిల తర్వాత తాను మాట్లాడే సమయంలో ఆయన కూడా రియాక్టు అయ్యారు. తాము తెరచాటు రాజకీయాలు చేయమని.. ఏం చేసినా బహిరంగంగానే చేస్తామన్నారు. తమతో మాట్లాడేందుకు మా పార్టీ ఆఫీసుకు వస్తామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల చెప్పారని.. వైఎస్ మీద ఉన్న గౌరవంతో ఆహ్వానించామన్నారు. ‘మర్యాదతో ఆహ్వానించాం. మాట్లాడాం. కానీ.. సోదరి ఆ మర్యాదను నిలుపుకోలేదు. మునుగోడు ఎన్నికల్లో మేం చేసిన పని చాటుగా చేయలేదు. బాహాటంగా చేశాం. రాజకీయంగా మా స్టాండ్ ఏమిటో చెప్పాం. మేం ఎవరికి బీ టీంగా పని చేయటం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇదంతా చూసిన వారంతా షర్మిలకు ఏమైంది? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫ్ గోల్ కంటే దారుణమైన రీతిలో ఆమె తీరు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.