లోకయ్యా.. నీకు స్క్రిప్టు రాసే వాళ్లకో నమస్కారం.. !?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 61వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా దాటి ఇప్పుడు అనంతపురం జిల్లాలో ప్రభంజనంలా సాగుతోంది. ఉదయం సెల్ఫీ విత్ లోకేష్ నుంచి సాయంత్రం బహిరంగ సభ వరకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. మార్పు కోరుకుంటున్న అశేష్ ఆంధ్ర జనావళి తమ యువ నాయకుడిని చూసేందుకు తరలి వస్తోందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అందులో తప్పేమీ లేదు. పార్టీ నిర్వహణ ఆశావహ దృక్పథంతో కూడుకుని ఉండాల్సిందే.. కాకపోతే లోకేష్ ఏం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు. ఆయన తీరు ఎలా ఉంది. బాడీ లాంగ్వేజ్ ఏమిటి అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.. దానిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా.. టీడీపీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అలా చేయడమే కరెక్టు…. కాకపోతే కొన్ని అంశాల్లో అయినా జాగ్రత్త పడాల్సిన అనివార్యత ఉంది..

బాబూ ఎస్కే యూనివర్సిటీ ఎప్పుడొచ్చిందీ..

నాయకులైన వాళ్లు ఏ విషయం ప్రస్తావించాలో, ఏ విషయంలో పూర్తి సమాచారం తెప్పించుకుని మాట్లాడాలో స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలి. దానికి సంబంధించి స్క్రిప్ట్ రైటర్లు, వ్యూహకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్త లోకేష్ యువగళంలో తరచూ లోపిస్తోందనిపిస్తోంది. తాజాగా మంగళవారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లోకేష్ బహిరంగ సభలో మాట్లాడినప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అర్థమైతే మాత్రం అందరూ తల పట్టుకు కూర్చోవాల్సిందే..

శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, సత్యసాయి యూనివర్సిటిలను అనంతపురం ప్రజలు పోరాడి తెచ్చుకున్నారని లోకేష్ ప్రస్తావించారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మాట్లాడిన మూడు మాటలే ఇప్పుడు చర్చకు అవకాశమిచ్చాయి. ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్న దళిత నేత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారని లోకేష్ ప్రకటించారు. ఎస్కే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యారని కూడా లోకేష్ లెక్క చెప్పేశారు. ఇంకాస్త ముందుకెళ్లి ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారన్నారు.

లోకేష్ కు తెలియకపోవచ్చు. స్క్ర్పీప్టు రైటర్ కైనా తెలియాలి కదా… పోనీ తెలియని విషయం రాయడం ఎందుకు.. సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎస్కే యూనివర్సిటీని 1981లో స్థాపించారు. అంతకముందు ఎస్వీ యునివర్సిటీ పరిధిలో అనంతపురంలో ఒక పీజీ సెంటర్ ఉండేది. అదీ కూడా 1967లో మాత్రమే స్థాపించారు. లోకేష్ చెప్పిన సర్వేపసల్లి రాధాకృష్ణన్… 1962 నుంచి 1967 మధ్య భారత రాష్ట్రపతిగా చేశారు. ఆయన తిరుపతిలో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో చదువుకున్నారే తప్ప అనంతపురం వైపు ఎప్పుడూ చూడలేదు. నీలం సంజీవరెడ్డి మద్రాసు, అనంతపురంలో చదివారు. 1931లో ఆయన అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువు మానేసి స్వాతంత్రోద్యమంలోకి వెళ్లారు. అప్పుడు యూనివర్సిటీ లేదు.

ఇక దళిత నాయకుడు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాలోనూ, మద్రాసులోనూ చదువుకున్నారు. 1950లోనే ప్రొవిజనల్ పార్లమెంట్ సభ్యుడయ్యారు. 1962లో ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన 20 సంవత్సరాలకు ఎస్కే యూనివర్సిటీ ఏర్పాటైంది. చరిత్ర తెలియని వారేవ్వరో స్క్రిప్టు రాసిచ్చారనేందుకు లోకేష్ అనంతపురం ప్రసంగమే మచ్చుతునకగా చెప్పుకోవాలి. కనీసం సమకాలీన చరిత్ర తెలిసి ఉన్నా ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండేవి కావు. ఇక్కడో పెద్ద సమస్య కూడా ఉంది. స్చీచ్ రాసిచ్చిన వారిని ఎవరూ తిట్టరు లోకేష్ కి ఏమీ రాదన్న చర్చే సోషల్ మీడియాలో జోరందుకుంటుంది.

60 రోజులు అవే డైలాగులు..

లోకేష్ స్పీచ్ రొటీన్ గా మారిపోయింది. కొత్త విషయాలు ఏమీ ఉండటం లేదన్న టాక్ మొదలైంది. జగన్ రెడ్డిని తిట్టిన తిట్లే తిడుతున్నారన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. మొదట్లో లోకేష్ స్వయంగా అభ్యర్థులను ప్రకటించడం మొదలెట్టారు.ఇదేంటి చంద్రబాబు చేయాల్సిన పని కూడా లోకేష్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తర్వాత ఆ పనికి స్వస్తి చెప్పడం మంచిదైంది.

పేర్లు పెట్టడం బాగుంది

లోకేష్ రోజుకో పేరును తెరపైకి తెస్తున్నారు. జగన్ కు ఆయన కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. అవి కొంత వినోదాన్ని పంచుతున్న మాట వాస్తవం. తాజాగా అనంతపురం పర్యటనలో పెట్టిన గాలి జగన్ పేరు కూడా బాగానే పేలిందని చెప్పాలి. కాకపోతే ఆ మధ్య మౌళి మోహన్ రెడ్డి అని ఒక పేరు పెట్టారు. ఆ మాటకు అర్థం తెలియక చాలా మంది టెన్షన్ పడ్డారు. చివరకు చిత్తూరు జిల్లాలో స్నేహితులకు ఫోన్ చేస్తే మౌళీ అంటే చెడ్డవాడు అని అర్థమైంది. చిత్తూరు జిల్లా మాండలీకాలను వాడితే తప్పులేదు.. ఇతర జిల్లాల వాళ్లు కన్ఫ్యూజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత రైటర్ల మీదే ఉంది.

ప్రస్తుతానికి లోకేష్ పావులారిటీ పీక్స్ కు చేరిందనడంలో సందేహం లేదు. ఆయన్నూ చూసేందుకు వేలాది మంది జనం గంటలకొద్దీ వేచి చూస్తున్నారు. ఆ పాపులారిటీ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత రైటర్ల మీద కూడా ఎంతో కొంత ఉంటుందని గుర్తించాలి..