ఎన్నికలొచ్చాయి.. స్వామీజీ మళ్లీ యాక్టివ్

భారత దేశంలో పౌరుల జీవితానికి మతానికి విడదీయరాని సంబంధం ఉంది. రోజూవారీ కార్యక్రమాల్లో కూడా మతాచారాలను పాటిస్తూనే ఉంటారు.మతం కోసం యుద్ధాలకు కూడా సిద్ధపడే వారున్నారు. అందుకే స్వామీజీలకు మంచి డిమాండ్ ఉంటుంది.నిజానికి జనంలో మంచిని బోధించే స్వామీజీలు చాలా మంది ఉన్నారు. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద కూడా జనంలో సత్ ప్రవర్తన ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కాకపోతే ఆయన తర్వాతి కాలంలోనే కొంత రాజకీయం వంటపట్టించుకున్నారనుకోవాలి. బీజేపీలో కూడా చేరారు..

సంచలన వ్యాఖ్యలు

పరిపూర్ణానంద మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డులివ్వాలన్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా వీర హనుమాన్ శోభాయాత్రలో స్వామి పరిపూర్ణానంద.. ఆధార్ కార్డుల అంశాన్ని ప్రస్తావించారు.
దేశంలో హిందువుగా జీవించే వారికి ఒక రకం ఆధార్ కార్డు, హిందువు కాకపోయినా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి రెండో రకం ఆధార్ కార్డు ఇవ్వాలని ఆయన సూచించారు హిందూ ధర్మాన్ని గౌరవించని వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు వెళ్లిపోవాలని, లేకపోతే వేరే దేశాలకు పారిపోవాలని హెచ్చరించారు..దేశంలో ప్రజా ప్రతినిధులు ఈ సంగతి గుర్తుంచాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్లకు మాత్రమే ఓటు వేయాలని ఆయన సూచించడం ఇప్పుడు మళ్లీ వివాదాస్పదమైంది..

రాజకీయాల్లోకి..

స్వామి పరిపూర్ణానంద తొలుత మత ప్రచారకుడిగానూ, ప్రవచనకర్తగానూ మాత్రమే ఉండేవారు. టీవీల్లో రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ బాగా ఫెమస్ అయ్యారు,. తర్వాతి కాలంలో రాజకీయాల వైపు దృష్టిపెట్టారు. యూపీ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ అయినట్లే.. తాను కూడా తెలంగాణ సీఎం కావాలని పరిపూర్ణానంద కోరుకుంటున్నట్లు 2018 ప్రాంతంలో వార్తలు వచ్చాయి. యోగీ వచ్చిన తర్వాతే యూపీ అభివృద్ధి పధంలో నడుస్తోందని, శాంతి భద్రతల స్థాపన సాధ్యపడిందని పరిపూర్ణానంద చెప్పుకున్నారు. పైగా కంచె ఐలయ్య రాసిన పుస్తకాలపై విమర్శలతో కులాలను, మతాలను రెచ్చగొట్టారన్న పేరు కూడా ఉంది. ఒక ఛానెల్ లో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఆయన పాదయాత్ర చేయాలనుకున్నారు. పోలీసులు అడ్డు తగిలి హౌస్ అరెస్టు చేయడంతో వివాదం సద్దుమణిగింది..

పార్టీ ఓడిపోవడంతో…

2018 ప్రాంతంలో పరిపూర్ణానంద రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. తన ప్రచారం కోసం ఒక టీవీ ఛానెల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో స్వామి డీలా పడిపోయారు. యూపీ తరహాలో తెలంగాణ కాలేకపోయిందన్న ఆవేదనతో ఆయన కొంతకాలం తెరమరుగయ్యారు. ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో స్వామి మళ్లీ పొలిటికల్ గా స్పీడ్ అందుకున్నారనుకోవాల్సి వస్తుంది..