వైరల్ పిక్: బెడ్ పై రామోజీ!

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వైరం పతాక స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. కొంత కాలంగా ఈనాడు జగన్ అండ్ కోను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేస్తుండగా.. అట్నుంచి కూడా స్పందన అదే స్థాయిలో కనిపిస్తోంది.

రామోజీని ఇరుకున పెట్టడానికి అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్‌కు ఉన్న ఆయుధం మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు ఒక్కటే అన్న సంగతి తెలిసిందే. మార్గదర్శిలో చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర అవసరాలకు వాడారన్న అభియోగాలతో సుదీర్ఘ కాలంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇటీవల పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలను మార్గదర్శి మీదికి ఉసిగొల్పుతూ రామోజీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది జగన్ సర్కారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మార్గదర్శి కేసును విచారిస్తున్న ఏపీ సీఐడీ పోలీసులు ఏకంగా హైదరాబాద్‌లో రామోజీ కుటుంబ సభ్యుల ఇళ్లలోకి అడుగు పెట్టేశారు. మార్గదర్శి కేసులో ఏ1, ఏ2గా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ (రామోజీ పెద్ద కోడలు)లను విచారించేందుకు ఏకంగా 20 మంది ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య రామోజీ, శైలజలను పోలీసులు విచారిస్తున్నారు. విచారణ కోసం పోలీసులు పిలవడంతో రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసం నుంచి బయల్దేరి.. జూబ్లీ హిల్స్‌లోని కిరణ్ ఇంటికి రామోజీ చేరుకున్నారు. అక్కడే విచారణ జరుగుతుండటంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

విచారణతో సరిపెడతారా.. ఈ కేసులో పోలీసులు ఇంకేదైనా ముందడుగు వేస్తారా అన్నది కీలకం. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను సైతం ఫిలిం సిటీలోని ఇంటికి పిలిపించుకుని మాట్లాడే రామోజీని.. ఇలా విచారణ కోసం ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్‌కు రప్పించారంటే అంటే జగన్ ఈ కేసు విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.