మోడీపై పెరిగిపోతున్న అనుమానాలు

మనదేశంలో ఏదోక అంశంపైన ప్రతిరోజూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజా వివాదం ఏమిటంటే నరేంద్ర మోడీ విద్యార్హత. నిజానికి మోడీ ఏమి చదువుకున్నారు అనే విషయంతో దేశానికి ఎలాంటి సంబంధం లేదు. మోడీ విద్యార్హతలతో దేశానికి వచ్చే లాభం కానీ నష్టంకానీ ఏమీ లేదు. కానీ ఇపుడా అంశమే బాగా వివాదాస్పదమైపోతోంది. మోడీ విద్యార్హతలు ప్రకటించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పడం వరకు ఓకేనే.

అయితే విద్యార్హతలు తెలుసుకోవాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అప్లై చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రు. 25 వేలు ఫైన్ వేయటంతోనే వివాదం రేగుతోంది. మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనుకుంటేనే ఫైన్ వేస్తారా అంటు గోల మొదలైపోయింది. ఇదే విషయమై కేజ్రీవాల్ మాట్లాడుతూ గుజరాత్ హై కోర్టు తీర్పు తర్వాత మోడీ విద్యార్హతలపై అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నట్లు చెప్పారు. పట్నా యూనివర్సిటిలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటిలో పీజీ చదివిందే నిజమైతే మోడీ తన విద్యార్హతలను ఎందుకని బహిర్గతం చేయటంలేదని పదేపదే నిలదీస్తున్నారు.

నిజానికి మనదేశంలో ప్రజాప్రతినిధులకు విద్యార్హతలతో పనిలేదు. రాయటం, చదవని వాళ్ళు కూడా అత్యున్నత పదవులను పొందవచ్చు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే ముందు దాఖలు చేసే అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తేనే ప్రాబ్లెమ్ వస్తుంది. ఇపుడు కేజ్రీవాల్ ఆరోపణల ప్రకారం మోడీ తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారట. గుజరాత్ హైకోర్టు తీర్పు తర్వాత దేశంలోని చాలామంది ప్రముఖులు తమ డిగ్రీ సర్టిఫికేట్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

అలాగే వివిధ రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు అంటే ఎంఎఏలు, ఎంపీలు, మంత్రులు కూడా తమ విద్యార్హతల సర్టిఫికేట్లను సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. కేటీయార్ కూడా తన డిగ్రీ సర్టిఫికేట్లను ప్రకటించారు.  వీళ్ళ స్ఫూర్తితో నెటిజన్లు కూడా డిగ్రీ సర్టిపికేట్లతో సోషల్ మీడియాను హోరెత్తించేస్తున్నారు. అంటే ఒకరకంగా ఇది మోడీపై మైండ్ గేమ్ అనే అనుకోవాలి. కాకపోతే ఈ మైండ్ గేమ్ రాజకీయ పార్టీలు, నేతలకే పరిమితం కాకుండా సామాన్య జనాలు కూడా చేరటమే గమనార్హం.