ఏపీలో నాయ‌కులు కావ‌లెను..

ఏపీలో విస్త‌రించాలని చూస్తున్న భార‌త రాష్ట్ర స‌మితి.. నాయ‌కుల కోసం ఎదురు చూస్తోందా? ప్ర‌స్తుతం అంతో ఇంతో నిజాయితీప‌రులైన నాయ‌కులు కావాల‌ని కోరుకుంటోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కూడా పోటీ చేయాల‌ని పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకు న్నారు. అయితే.. ఇక్క‌డ ఆయ‌న‌కు పార్టీలో చేరే నాయ‌కుల కొర‌త పెరిగింది.

ఎవ‌రు పార్టీలో చేరాల‌న్నా.. కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తున్న‌ట్టు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నా యి. అదేస‌మ‌యంలో త‌మ‌కు హామీలు కూడా ఇవ్వాల‌ని కోరుతున్నారు. దీంతో ఎవ‌రిని చ‌ర్చుకోవాలో తెలియ‌క ఒకింత ఇబ్బంది ఏర్ప‌డుతోంది ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే వ్యూహాత్మ‌కంగా.. మాజీ సివిల్ స‌ర్వీసు ఉద్యోగుల‌ను ఎంచుకుంటున్న‌ట్టు చెబుతున్నారు.

వీరైతే.. అంతో ఇంతో నిజాయితీగా ఉంటార‌ని కేసీఆర్ భావిస్తున్నారు. రావెల కిశోర్‌బాబు కూడా.. ఆలిండి యా స‌ర్వీసు ఉద్యోగే. తోట చంద్ర‌శేఖర్‌కూడా.. అదే బాపతు. ఇక‌, ఈ క్ర‌మంలోనే సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ కు ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే.. దీనిపై ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నం నేవీ కార్పొరేషన్ డైరెక్ట‌ర్‌గా ఉన్న మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావును కూడా లాగుతు న్నార‌ని స‌మాచారం.

ఇటీవ‌ల విశాఖ‌లోనే సాంబ‌శివ‌రావుతో ఏపీ బీఆర్ ఎస్ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ భేటీ అయ్యార‌ని.. పార్టీలో చేరాలని కోరిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి ఆయ‌న స‌మ్మ‌తించినా.. మ‌రో ఏడాది పాటు ప‌దవీ కాలం ఉండ‌డంతో ఆది చూసుకుని వ‌స్తాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. అదేవిధంగా ప్ర‌స్తుతం ఐఏఎస్‌గా సీఎంవోలో విధులు నిర్వ‌హిస్తున్న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారికి కూడా బీఆర్ ఎస్ నేత‌లు వ‌ల విసిరిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఆయ‌న ఇంకా చిక్క‌లేదు. ఇలా.. బీఆర్ ఎస్ త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.