అమ్మ ఇంట్లో దొరికిన బంగారం.. వెండి లెక్కలు విన్నారా?

మరోసారి వేద నిలయం వార్తల్లోకి వచ్చింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని అమ్మ నివాసం ఇప్పుడు ఆమె స్మారక చిహ్నంగా మారటం తెలిసిందే. దశాబ్దాల తరబడి తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ భవనం.. అమ్మ కన్నుమూసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిందో తెలిసిందే. ఈ భవనం యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరిగింది. చివరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంతో.. ఈ భవనం ఎవరికి చెందాలన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.

2016లో అనూహ్యంగా అనారోగ్యానికి గురైన ఆమె..సుదీర్ఘ వైద్య చికిత్స తర్వాత ఆమె అక్కడే కన్నుమూశారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే సమయానికి ఆమె సజీవంగా లేకపోవటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అధికార దర్పానికి చిహ్నంగా కొందరు భావించే ఈ వేద నిలయం మొత్తం మూడు అంతస్తుల్లో ఉంటుంది. 21వేల చదరపు అడుగుల్లో ఉండే ఈ ఇంటిని స్మారక కేంద్రంగా మార్చారు. ఇక.. ఈ ఇంట్లో ఏమేం ఉన్నాయన్న వివరాల్ని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

వేద నిలయాన్ని జయలలిత స్మారకంగా మార్చనున్న నేపథ్యంలో అక్కడ ఉండే వస్తువల్ని.. చరాస్తుల్ని పురట్చితలైవి డాక్టర్ జె జయలలిత మెమోరియల్ ఫౌండేషన్ కు బదిలీ చేయనున్నారు. ఇక.. ఆ ఇంట్లో లభించిన ఆభరణాలు.. చరాస్తుల లెక్కల్లోకి వెలితే..

బంగారం మొత్తం 4.3కేజీలు ఉంటే.. వెండి మాత్రం ఏకంగా 601 కేజీలు ఉన్నట్లు లెక్క తేల్చారు. 14 బంగారు ఆభరణాలు.. 867 వెండి ఆభరణాలు.. 162 వెండి పాత్రలు.. 11 టీవీలు.. 10 ఫ్రిజ్ లు.. 38 ఏసీలు.. 556 ఫర్నిచర్ సామాన్లు ఉన్నట్లు చెప్పారు.

ఆమె వంటింట్లో 6514 కిచెన్ పాత్రలు.. 15 పూజ పాత్రలు ఉన్నట్లు చెప్పారు. అన్నింటికంటే ఆశ్చర్యకరంగా 1105 షోకేస్ కత్తులు ఉన్నాయి. ఇక.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమ్మ చెప్పుల లెక్క మరోసారి తెర మీదకు వచ్చింది. ఆమెకు ఏకంగా 10,438 చెప్పుల జతలుఉన్నట్లుగా తేల్చారు. వీటిని పెట్టటానికే పెద్ద రూం కావాలేమో? 29 సెల్ ఫోన్లు.. 221 కిచెన్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు.. 394 మెమోంటోలు.. 653 ఐటీ.. కోర్టు.. లైసెన్సుల పత్రాలు లభించాయి. ఇవే కాదు.. 65 సూట్ కేసులు.. 6 గడియారాలు.. 108సౌందర్య సాధనాలు ఉన్నట్లుగా తేల్చారు.

పూజసామాను.. వంట సామాను.. ఇలా ఇంట్లో ఉన్న ప్రతిదానిని (చెప్పులతో సహా) లెక్క వేసి అంకెల్లో తేలిస్తే.. మొత్తం 32,721 ఐటెమ్స్ ఉన్నట్లుగా తేల్చారు. వేదనిలయాన్ని తమ అధీనంలోకి తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కోర్టులో రూ.67.9 కోట్లు ఖర్చు చేయగా.. అందులో 36.9 కోట్లు ఆదాయపన్ను శాఖకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వేద నిలయం సమ్ థింగ్ స్పెషల్ అన్న దానికి తగ్గట్లే.. అందులోని వస్తువల వివరాలు ఉన్నాయని చెప్పక తప్పదు.