రాహుల్ పై వేటు: కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్‌

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు.. రాహుల్ గాంధీ పై పార్ల‌మెంటు వేటు వేయ‌డాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తీవ్రంగా ఖండించారు. “భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమ‌ని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందన్నారు. మోడీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు.

నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీదుర్మార్గ విధానాలను ప్రతిఘటించాల‌ని పిలుపునిచ్చారు.

ప్రియాంక రియాక్ష‌న్ ఇదే..

రాహుల్‌పై అన‌ర్హ‌త వేటును మోడీ దాడిగా ఆయ‌న సొద‌రి.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ అభివర్ణించారు. వారసత్వ రాజకీయాలతో తన కుటుంబాన్ని ముడిపెడుతూ విమర్శిస్తుంటారని, నిజానికి తమ కుటుంబ రక్తంతో భారత ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దామని ప్రియాంక చెప్పారు. పార్లమెంట్ నుంచి తొలగించగలరు కానీ కోట్లాది మంది ప్రజల హృదయాలనుంచి రాహుల్‌ను తొలగించలేరని అన్నారు.