ఈ గెలుపు.. టీడీపీకి ఎలా మేలు చేస్తుందంటే..!

ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో టీడీపీ దూకుడుగా ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల లో టీడీపీ మ‌ద్ద‌తుదారులుగా ఉన్న‌వారు మూడు ప్రాంతాల్లోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఉత్త‌రాంధ్ర , ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌, తూర్పు సీమల ప‌రిధిలో మొత్తంగా.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఆ విజ‌యంతోనే.. పార్టీ పుంజుకుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఇప్ప‌డు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌తో మ‌రింత‌గా పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌నే చెప్పాలి.

అస‌లు ఏమాత్రం అంచ‌నాలు లేకుండానే రంగంలోకి దిగిన టీడీపీ.. భారీ విజ‌యాన్నే న‌మోదు చేసింది. వైసీపీ అభ్య‌ర్థుల‌కు కూడా రాని ఓట్లు టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ‌కు ప‌డ్డాయి. దీంతో చిర‌కాలంగా గుర్తింపు కోసం అల్లాడుతున్న పంచుమ‌ర్తికి గొప్ప అదృష్టం వ‌రించింద‌నే చెప్పాలి. అయితే.. ఈ గెలుపు.. టీడీపీకి చాలా మేలు చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

ఒక‌టి పొత్తుల ప‌రంగా.. పార్టీకి చాలా మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ కోసం.. టీడీపీ ఎదురు చూస్తోంది. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు నాన్చుడు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించిన బీజేపీ.. ఇక‌, ఇప్పుడు ఎదురు వ‌చ్చి పార్టీతో పొత్తుపెట్టుకునే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. టీడీపీ పుంజుకుంటుందా? లేదా.. అని కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఎదురు చూశారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు వేసి.. ఆయ‌న‌ను ఢీ కొట్టే శ‌క్తి టీడీపీకి ఉందా? అని కూడా భావించారు.

సో.. ఇప్పుడు టీడీపీ ఈ రెండు ప‌రీక్ష‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అయింది. సో.. పొత్తు పెట్టుకునేందుకు టీడీపీకి ఇత‌ర పార్టీలే అందుబాటులోకి రానున్నాయి. ఇక‌, పార్టీ ప‌రంగా ఇప్ప‌టి వ‌ర‌కు నైరాశ్యంలో ఉన్న కేడ‌ర్ కూడా పుంజుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు.. అంతో ఇంతో.. సందేహం ఉన్న పార్టీనేత‌ల్లో తాజాగా విజ‌యం..స‌ద‌రు సందేహాల‌ను తుడిచి పెట్టేసింద‌ని అంటున్నారు. అంటే.. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి చాలా వ‌ర‌కు చేరువైంద‌నే వాద‌న బ‌లం చేకూరుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. న‌లుగురు ఎమ్మెల్సీ విజ‌యం.. నాలుగు ర‌కాలుగా టీడీపీకి మేలు చేస్తుంద‌ని అంటున్నారు.