టీడీపీకి ఆక్సిజన్ పెరుగుతోందా ?

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నైతికంగా బలం పుంజుకుంటోందా ? అంటే అవుననే చెప్పాలి. మొన్ననే మూడు పట్టభద్రుల ఎంఎల్సీల సీట్లను గెలుచుకోవటం, తాజాగా ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలో ఒక సీటు గెలుచుకోవటం అంటే పార్టీకి ఆక్సిజన్ పెరుగుతున్నట్లే అనుకోవాలి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీలో బాగా నైరాశ్యం పెరిగిపోయింది. ఎందుకంటే ఎన్నిక ఏదైనా ఓటమి మాత్రమే ఎదురవుతోంది.

పార్టీ నేతల్లో జోష్ పెంచాలన్న చంద్రబాబునాయుడు ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టేసి అధినేత రకరకాల ప్రోగ్రాములతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. నేతల్లో మనో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం మీద రెగ్యులర్ గా పోరాటాలు చేస్తున్నారు. చంద్రబాబును స్పూర్తిగా తీసుకుని తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నేతలు కూడా మళ్ళీ చురుగ్గా కనబడుతున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే రోజుల వ్యవధిలో నాలుగు ఎంఎల్సీ స్దానాలను గెలుచుకోవటం అంటే పార్టీకి ఆక్సిజన్ అందినట్లే అనుకోవాలి. నిజానికి ఇపుడు గెలుచుకున్న ఎంఎల్సీల గెలుపు వల్ల శాసనమండలిలో పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఈ గెలుపును ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతంగా చూడాలి. దీన్నే చంద్రబాబు ప్రముఖంగా హైలైట్ చేస్తున్నారు. అందుకనే నేతలు, కార్యకర్తల్లో బాగా ఉత్సాహం కనబడుతోంది. ఇపుడు జరిగిన ఎన్నికలకు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.

అయితే రాబోయే ఎన్నికల్లో పూర్తిస్ధాయి సామర్ధ్యంతో పోరాడాలంటే ఇపుడీ విజయాలు టీడీపీకి మంచి టానిక్కుగా పనిచేస్తాయి. ఇపుడు లభించిన ఆక్సిజన్ తో తమ్ముళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేయాలంటే రాబోయే ఏడాదికాలం ఎంతో జాగ్రత్తగా కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలి. పొత్తులు, సీట్ల కేటాయింపు, అభ్యర్ధుల ఎంపిక లాంటి విషయాల్లో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మొహమటానికి పోయినా, ఒత్తిళ్ళకు లొంగిపోయినా పార్టీ ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇపుడు అందిన ఆక్సిజన్ ఏడాది పాటు ఉండాలంటే పార్టీ కార్యక్రమాల్లో మరింత స్పీడు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.