వైసీపీ కుప్ప‌కూలుతుంది.. టీడీపీ ఉగాది పంచాంగం!

ఎవ‌రి పంచాంగం వారిదే. ఎవ‌రి భ‌విష్య‌త్తు వారిదే. శోభ‌కృత్ నామ నూత‌న ఉగాది సంవ‌త్స‌రం రోజు అన్ని పార్టీలూ ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో టీడీపీ నిర్వ‌హించిన ఉగాది వేడుక‌లు హైలెట్‌గా నిలిచాయి. పంచాంగ క‌ర్త మాట్లాడుతూ.. ఈ ఏడాది సైకిల్‌ దూసుకెళ్తుందన్నారు. ప్రజల్లో నారా లోకేష్‌కు మంచి గుర్తింపు వస్తుందని, చంద్ర‌బాబు.. చంద్రుడు.. ఇంద్రుడై.. చక్రం తిప్పుతారని వెల్ల‌డించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని పంచాంగ ప‌ఠ‌నంలో వెల్లడించారు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. వైసీపీ ప‌టాపంచ‌లు అయి.. త‌నంత‌ట త‌నే కుప్ప‌కూలుతుంద‌ని ప‌ఠ‌న క‌ర్త వెల్ల‌డించారు. మొత్తానికి ఉగాది టీడీపీలో జోష్ నింపింది.

ప్ర‌జాస్వామ్యం కోసమే నా ఆరాటం: చంద్ర‌బాబు

ఉగాది పంచాంగం ప‌ఠ‌నం అనంత‌రం.. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండటానికి ఇది రాచరికం కాదని ప‌రోక్షంగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని, ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని బాబు స్పష్టం చేశారు.

గ‌త నాలుగేళ్లుగా రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, శోభకృత్ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి.. టీడీపీకి ఓట్లేశారన్నారు. అరాచకానికి కూడా ఓ పద్దతి.. ఓ విధానం ఉంటుందని.. కానీ గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశానని.. ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయని అన్నారు. అధికార పార్టీ ఆశలు ఇక సాగవని పంచాంగంలో కూడా చెప్పారన్నారు.

ధరలు పెరిగాయి.. పన్నులు పెరిగాయి.. ప్రజలపై భారం పడిందని చంద్రబాబు అన్నారు. ధరలు పెరుగుదలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. “పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుంది.. పంచాంగం ఎంతో శాస్త్రోక్తంగా రాస్తున్నారని.. అస్ట్రాలజీ కూడా సైన్సేనని.. ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఎంతో ఉపయోగపడుతుంది” అని చంద్ర‌బాబు చెప్పారు. తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోందని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారి ప్రతిష్ట పెరిగిందన్నారు. ఉగాదికి.. టీడీపీకి దగ్గర సంబంధం ఉందని.. తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించార‌ని చంద్రబాబు స్పష్టం చేశారు.