తన బట్టలు తనే ఉతుక్కుంటున్న ముఖ్యమంత్రి

ఒకప్పటి భారత ప్రధాని లాబ్ బహదూర్ శాస్త్రిని కలుద్దామని ఓ నాయకుడు ముందు చెప్పకుండా ఆయన ఇంటికి వెళ్తే.. బట్టలు ఉతుక్కుంటూ కనిపించారట. దీని గురించి జనాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

కానీ ఇప్పటి మన నేతాశ్రీల నుంచి ఇలాంటి సింప్లిసిటీని ఊహించగలమా? కానీ చోటా నేతలు కూడా వందలు, వేల కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో కూడా ఓ ముఖ్యమంత్రి కొన్ని రోజులుగా తన బట్టలు తనే ఉతుక్కుంటున్నాడంటే షాకవ్వాల్సిందే.

ప్రస్తుత భారత దేశ ముఖ్యమంత్రుల్లో అత్యంత సింపుల్‌గా ఉండే నాయకుల్లో ఒకడిగా పేరున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే పని చేస్తుండటం విశేషం. ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని రోజుల కిందటే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.

ఐతే మన నాయకుల్లా చౌహాన్ వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టేయలేదు. ముఖ్యమంత్రిగా తాను అందరికీ ఆదర్శంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై జనాల్లో నమ్మకం పెంచాలనే ఉద్దేశంతో అందులోనే చేరారు. అక్కడ ఆయన తన పనులన్నీ సొంతంగా చేసుకుంటున్నారట.

తాను వాడిన బట్టలు, వస్తువులు వేరొకరు ముట్టుకుంటే వారికి వైరస్ సోకుతుందన్న ఉద్దేశంతో ఆయనే స్వయంగా బట్టలు ఉతుక్కుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన తన మంత్రులతో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.

ఆసుపత్రి నుంచే వర్చువల్ మీటింగ్ ద్వారా చౌహాన్ మంత్రిమండలి సమావేశం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది తమ బట్టలు తాము ఉతుక్కోవడాన్ని నామోషీగా భావిస్తారని.. కానీ తాను అలా భావించలేదని.. కొంత కాలం కిందట తన చేతికి శస్త్రచికిత్స జరిగిందని.. ఇప్పుడు బట్టలు ఉతకడంతో దానికి ఉపశమనం లభించిందని సమావేశంలో చమత్కరించడం విశేషం.