యువగళం: ఒక్క పాదయాత్ర వేల ప్రశ్నలకు సమాధానం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాను చేపట్టిన పాదయాత్రతో తానేంటో నిరూపించుకున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న అన్ని రకాల విమర్శలకు ఈ పాదయాత్రతో సమాధానం చెప్పారనే అంటున్నారు. లోకేశ్ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు నిర్దయగా బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు, ఆయన భాషను ఎగతాళి చేసిన సందర్భాలు, ఆయన మానసిక పరిణతిని ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు. వీటన్నిటికీ యువగళం సమాధానం చెప్పిందని… అందుకే లోకేశ్‌పై విమర్శలు ఆగిపోయాయి.

నారా లోకేశ్ పాదయాత్ర 50 రోజులకు చేరుకుంటోంది. ఆయన యాత్ర ప్రారంభించినప్పుడు అసలు ఆయన ఎన్ని రోజులు నడుస్తారన్న అనుమానాలు అందరి నుంచి వినిపించాయి. యాత్ర పూర్తి చేయలేరంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ‘నాన్నారూ.. నడవలేకపోతున్నాను’ అంటూ మీమ్స్ చేసి సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు. అయినా, లోకేశ్ అవేమీ పట్టించుకోకుండా సాగిపోతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయా అంశాలను బహిరంగ సభలో ప్రస్తావిస్తూ భరోసా ఇస్తున్నారు.

అదే సమయంలో ప్రస్తుత జగన్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు లోకేశ్. ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి చేయలేకపోవడం.. ఇసుక దందాలు, పరిశ్రమలు పోవడం వంటి అన్ని అంశాలూ లేవనెత్తుతున్నారు.

వీటితో పాటు తాము అధికారంలోకి వస్తే ఇసుకను పూర్తిగా ఉచితంగా ఇస్తామని లోకేశ్ చెప్పడంతో అది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి బలంగా వెళ్లింది. గత మూడున్నరేళ్లలో ప్రజలు ఇళ్ల నిర్మాణంలో ఇసుక కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాకపోవడంతో ఇసుకను ఉచితంగా ఇవ్వడమనేది మంచి మైలేజ్ తీసుకొచ్చింది.

లోకేశ్‌కు ఏమీ తెలియదు అన్న రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు కూడా నిజం కాదని ప్రజలకు ఈ యువగళం యాత్రతో అర్థమైంది. లోకేశ్ చేతిలో చిన్న కాగితం కూడా పట్టుకోకుండా తాను మాట్లాడాల్సిన విషయాలన్నీ మనసులోనే గుర్తుంచుకుని అనర్గళంగా మాట్లాడుతుండడం ప్రజలు తమ కళ్లతో తాము చూస్తున్నారు. వడివడిగా అడుగులేసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్ తన పాదయాత్రలో అన్ని వర్గాలనూ కలుస్తూ రాష్ట్రమంతా ఇదే జోరుతో ముందుకు సాగుతున్నారు.