వ‌చ్చేది సునామీ.. వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతే: చంద్ర‌బాబు

ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం వ‌చ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఒక చిన్న గాలి వాన మాత్ర‌మేన‌ని, కానీ, రాబోయే ఎన్నిక‌ల్లో మాత్రం సునామీ త‌ప్ప‌ద‌ని.. అప్పుడు వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతవ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేపై దాడి చీకటి రోజు అని అభివర్ణించారు. ఈ విషయమై ఈ నెల 25 నుంచి మూడ్రోజుల పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

జీవో నంబర్ 1, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై దాడి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పర్యటనలు చేపట్టనున్నారు. జీవో నంబర్ 1 జారీ చేసిన ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన ఘటన చూస్తుంటే కోపం వస్తుందన్నారు. జీవో నంబర్ 1ను రద్దు చేయమని అడగడం తప్పా అని నిలదీశారు.

ఆగస్టు సంక్షోభంలోనూ.. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ.. సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. ఇవాళ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించా రు. పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి మీదకు వస్తారా..? అని మండిపడ్డారు. స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయాననే బాధ తనకెప్పుడూ ఉంటుందన్నారు. వైసీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్ర‌బాబు హెచ్చరించారు.

ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయాలనే ఆలోచన తనకెప్పుడూ రాలేదన్నారు. బాబాయ్ గొడ్డలిపోటు, కోడి కత్తి డ్రామా తరహాలో నే ఇప్పుడు సభలో వైసీపీ వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది చిన్న గాలే.. రాబోయేది సునామీ.. అని హెచ్చరించారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు.. కానీ, అసెంబ్లీ శాశ్వతమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనప్పుడే.. ఎమ్మెల్యేలు విజ్ఞతతో వ్యవహరించారని గుర్తు చేశారు.