వైసీపీకి సాయిరెడ్డే లోటు తెలిసొచ్చిందా…!

ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి మోస్ట్ డిపెండ‌బుల్ లీడ‌ర్ విజ‌య‌సాయిరెడ్డేనా? అంటే..ఔన‌నే మాటే ప‌రిశీల‌కులు. విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన రెండు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సాయిరెడ్డి ఎంత కీల‌క‌మో.. అర్ధ‌మ‌వుతుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. ఢిల్లీలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డం. రెండు. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఘోరంగా విఫ‌లం కావ‌డం.

ఈ రెండు అంశాల్లోనూ సాయిర్డెడ్డి ప్ర‌త్య‌క్షంగాను.. ప‌రోక్షంగాను ఉన్నారు. ఢిల్లీలో సాయిరెడ్డి చ‌క్రం తిప్పు తున్న‌ట్టు ఇత‌ర వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా చ‌క్రం తిప్ప‌డం లేదు. పైగా.. సాయిరెడ్డి దూకుడు ముందు ఎవ‌రూ నిల‌వ‌ర‌నే పేరు కూడా ఉంది. నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరు పెట్టి పిలిచే నాయ‌కుల్లో సాయిరెడ్డి ఉన్నారు. కానీ ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఇత‌ర నేత‌ల‌కు లేదు. అందుకే.. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప‌ని ఢిల్లీలో జ‌ర‌గాల‌న్నా.. సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వాల్సిందే.

తాజాగా సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో వైవీ సుబ్బారెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వాస్త‌వానికి ఏ ఎన్నిక వ‌చ్చినప్ప‌టికీ సాయిరెడ్డి విజృంభిస్తార‌నే పేరుంది. కానీ.. ఈ సారి మాత్రం సుబ్బారెడ్డి చూశారు. మ‌రి ఆయ‌న వ్యూహాలు ఫ‌లించ‌లేదు. దీంతో వ‌స్తుందని ఆశ‌లు పెట్టుకున్న స్థానం కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఇదిలావుంటే.. కొన్నాళ్లుగా వైసీపీలో స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి హ‌వా పెరిగింది. ఆయ‌న దూకుడు పెంచారు. సాయిరెడ్డి ఎక్క‌డ నెంబ‌ర్ 2 అవుతార‌ని అనుకున్నారో..ఏమో.. కానీ, ఆయ‌న‌ను త‌ప్పించే క్ర‌తువులో స‌జ్జ‌ల ముఖ్య‌పాత్ర పోషించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల నుంచి వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం వ‌ర‌కు కూడా.. సాయిరెడ్డిని త‌ప్పించేశారు.

కానీ, స‌జ్జ‌ల‌కు కేవలం అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై ప‌ట్టుందే త‌ప్ప‌.. రాజ‌కీయంగా మాత్రం ఆయ‌న‌కు ప్ర‌జాక్షేత్రంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యంపై మాత్రం ప‌ట్టులేదు. ఇదే.. ఇప్పుడు కొంప‌ముంచుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. సాయిరెడ్డి వైసీపీకి అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడు అన‌డంలో ఎలాంటి సందేహాలు లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.