కన్నా మార్పు వెనుక ఆయన ‘హస్తం’?

ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుందన్న వార్తలు వస్తున్నాయి. కానీ.. అదెంతమాత్రం నిజం కాదు. ఎందుకంటే.. ఒక పద్దతి ప్రకారమే ఆయన సీటు మార్చటం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. కన్నాను పదవి నుంచి తప్పించి..ఆయన స్థానంలో మరొకరికి ఆ బాధ్యతను అప్పజెబుతారన్న మాట కొద్దిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు.. సీఎం జగన్మోహన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాటలే నిజమయ్యాయి. కన్నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న విజయసాయి రెడ్డి.. కన్నా స్థానంలో కొత్త రథసారధి వస్తారన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

కన్నా స్థానంలో ఎమ్మెల్సీ మాధవ్.. సీమ ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినిపించినా.. సోము వీర్రాజుకే పట్టం కట్టటం వెనుక అసలు కారణం వేరే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక అంశాలే కీలకంగా మారాయని చెప్పక తప్పదు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా.. అతి పెద్ద ఓటుబ్యాంకుగా కాపులు ఉన్నారు. కానీ.. ఏ పార్టీలోనూ వారికి దక్కాల్సిన రాజకీయ ప్రాబల్యం దక్కలేదు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ వరుస ఆ వర్గానికి పెద్ద పీట వేస్తూ.. వారే రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తోంది.

ఇప్పటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతన్నది మర్చిపోకూడదు. తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన సోమును అధ్యక్షుడిగా ఎంపిక చేయటానికి కారణాల్లో ప్రధానమైనది కన్నాను తప్పించటం ద్వారా వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలకు తగ్గట్లు నిర్ణయం తీసుకున్నామే తప్పించి.. తాము పెద్దపీట వేసే సామాజిక వర్గానికి ఎప్పటిలానే ప్రాధాన్యత తగ్గదన్న విషయం స్పష్టమైందని చెప్పాలి.

కన్నాను మార్చటం వెనుక విజయసాయి కీలకభూమిక పోషించినట్లుగా చెబుతున్నారు. బీజేపీ అధినాయకత్వంతో ఆయనకున్న సంబంధాలు.. సానిహిత్యం కూడా అంతో ఇంతో పని చేశాయని చెబుతున్నారు. కన్నాను టార్గెట్ చేసిన విజయసాయి.. తాజాగా చేసిన మార్పుతో ఇంతకాలం ఆయన చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుందని చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్నే మార్చగలిగిన ‘శక్తి’ తనకుందన్నది విజయసాయి చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఏది ఏమైనా కన్నా తొలగింపులో విజయసాయి కీలకభూమిక పోషించారన్న మాట ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించటం గమనార్హం.