కాంగ్రెస్ సీనియర్లపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్ళీ బాగా కెలికేశారు. పార్టీలోని కొందరు పెద్ద రెడ్లు కేసీయార్ కు అమ్ముడుపోయారంటు ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన తాజా ఆరోపణ చాలా పెద్దదనే చెప్పాలి. కొందరు సీనియర్లంటే కత వేరే విధంగా ఉండేది. కానీ పర్టిక్యులర్ గా కొందరు పెదరెడ్లన్నారు. దాంతోనే రెడ్లందరిలో ఇపుడు మంట మొదలైంది. తాను రెడ్డి అయ్యుండి కొందరు సీనియర్ రెడ్లని చెప్పటంలో అర్ధమేంటో రేవంత్ కే తెలియాలి.

తన యాత్రలో భాగంగా రేవంత్ నిజామాబాద్ కు చేరుకున్నారు. అక్కడ మాట్లాడుతూ సందర్భం ఏమిటో తెలీదు కానీ ఉన్నట్టుండి కేసీయార్ కు పార్టీలోని కొందరు పెద్ద రెడ్లు అమ్ముడుపోయారని పెద్ద ఆరోపణ చేసేశారు. ఇపుడే పార్టీలో అసలైన పంచాయతీ మొదలైంది. కేసీయార్ కు అమ్ముడుపోయిన పెదరెడ్లు ఎవరనే పంచాయతీ మొదలవ్వటం ఖాయం. అసలే రేవంత్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏ మాత్రం పడదు.

వీళ్ళల్లో వీళ్ళకి ఎన్ని గొడవలున్నా రేవంత్ కు వ్యతిరేకంగా మాత్రం అందరు ఏకమవుతారు. పైగా వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మీద పార్టీలోనే చాలామందికి అనుమానాలున్నాయి. జగ్గారెడ్డి ఈమధ్యనే కేసీయార్ తో భేటీఅయ్యారు. వెంకటరెడ్డి ఏదోరోజు బీజేపీలోకి వెళిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇలాంటి వాళ్ళు పార్టీలోనే ఉంటూ పార్టీని దెబ్బతీయటమే టార్గెట్ గా పెట్టుకున్నారనే టాక్ పార్టీలోనే నడుస్తోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొందరు రెడ్లు అమ్ముడుపోయారంటు రేవంత్ చేసిన వ్యాఖ్యలు మంటలు మండించకుండా ఉంటాయా ? వ్యాఖ్యలు చేసింది సోమవారం రాత్రే కాబట్టి మంగళవారం మధ్యాహ్నానికి దాని ప్రభావం మొదలవుతుందని అనుకుంటున్నారు. మరి తన ఆరోపణలకు రేవంత్ ఎంతవరకు కట్టుబడుంటారు ? అవసరమైతే తన వ్యాఖ్యలను ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి. ఆరోపణలు చేయటం కాదు అందుకు తగ్గ ఆధారాలను కూడా చూపగలగాలి. అసలే ఇది కాంగ్రెస్ పార్టీ. నూరుశాతం ప్రజాస్వామ్యంతో నడిచే పార్టీ కాబట్టి ఆరోపణలు చేసి ఊరుకుంటామంటే కుదరదు. తన వ్యాఖ్యలపై ఆధారాలు చూపకపోతే రేవంత్ ను ఎవరూ వదిలిపెట్టరు.