కవిత విచారణ: దిల్లీలో బీఆర్ఎస్ నేతల హడావుడి

kavitha

దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఈడీ విచారిస్తుండడంతో ఈడీ కార్యాలయం దగ్గర హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా కవిత విచారణ ఉదయం 10 గంటల తరువాత మొదలుకానుంది. ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, మాజీ సీఏలను అరెస్టు చేశారు. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు దిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా దిల్లీకి వచ్చారు.

కవిత విచారణ, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో దిల్లీకి చేరుకోవడంతో ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో దిల్లీకి రావడంతో… ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆందోళనలు చేయొచ్చని.. నిరసనలు ఉద్ధృతం కావొచ్చన్న అంచనాలతోనే పెద్దఎత్తున కేంద్ర బలగాలు మోహరించారు.

మరోవైపు కవిత భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్తుండడంతో కార్యకర్తలను అదుపు చేసేందుకు కవిత ఇంటి నుంచి దారిలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. ర్యాలీకి పర్మిషన్ లేదని.. కవితతో పాటు మరో కారు మాత్రమే ఈడీ కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు అనౌన్స్ చేసినప్పటికీ కవిత ఇంటివద్ద కార్యకర్తల జోరుతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.